Anupama Parameswaran: ఈ మధ్య విడుదలవుతున్న సినిమాలపై సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala) సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పరంగా వివాదం ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ విషయంపై మాలీవుడ్ అట్టుడికి పోతుంది. తాజాగా దీనిపై నిర్మాత సురేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్లాల్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమాను నిందిస్తూ మాట్లాడారు. ‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమా విడుదలైనప్పటి నుంచే కేరళ చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారాయని, ఆ సినిమా వచ్చినప్పటి నుంచే సెన్సార్ విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. వివాదానికి దారితీసిన పరిస్థితులు నిర్మాత వివరించారు.
Also Read –Atchannaidu: ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ గాలి తీసిన అచ్చెన్న..!
‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమా విడుదల సమయంలో పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. దీంతో సినిమాకు మరోసారి సెన్సార్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సినిమా విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. దీంతో సెన్సార్ బోర్డు ప్రతి సినిమాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మాత్రమే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ లోనే వివాదం నెలకొంది. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాలో జానకి అనే పదం గురించి సెన్సార్ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. టైటిల్లో జానకి అనే పదం ఉంచడమా, తీసివేయడమా అన్నది న్యాయస్థానం నిర్ణయించనుంది. అది పేరుగా మాత్రమే పరిగణించి న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని నిర్మాత ఆశిస్తున్నారు. మాలీవుడ్లో ‘కూలీ’, ‘చరిత్రం’, ‘విష్ణులోకం’, ‘కశ్మీరం’, ‘కవర్ స్టోరీ’, ‘కుబేరన్’, ‘మహా సముద్రం’, ‘వాశి’ వంటి చిత్రాలకు సురేశ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.
Also Read – Renu Desai: రెండో పెళ్లి.. మరోసారి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే సినిమా రూపొందింది. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది, అనేది దీనికి ట్యాగ్లైన్. ఇదొక థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న సినిమా కావడంతో మంచి విజయం సాధిస్తుందని నిర్మాత భావిస్తున్నారు. ఇందులో జానకిగా అనుపమ నటిస్తున్నారు. సీతాదేవి పేరు జానకి కావడంతో సెన్సార్ బోర్డు వ్యతిరేకిస్తుంది. సినిమాలో దాడికి గురైన మహిళ పాత్రకు ఆ పేరు పెట్టడం సమంజసం కాదని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి తెలిపింది. సినిమా పేరు మార్చాలని కోరింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై 9వ తేదీన వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ని క్రియేట్ చేస్తుంది. ‘కోర్టులో న్యాయం గెలుస్తుందా… ఆధారాలు గెలుస్తాయా’ అన్నదానికి సినిమా ఓ కంక్లూజన్ తేనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.