Cyber Crime: సైబర్ క్రిమినల్స్ బస్తీమే సవాల్ అంటున్నారు. ఒకవైపు పోలీసులు సైబర్ నేరాలకు కళ్లెం వేయటానికి విస్తృత చర్యలు తీసుకుంటుంటే మరోవైపు మోసగాళ్లు నేరాలను కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న హైకోర్టు వెబ్ సైట్(High Court website) ను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా సీఎంవో, డిప్యూటీ సీఎంవో, మంత్రుల అధికారిక వాట్సాప్ గ్రూప్ లను నియంత్రణలోకి తీసుకున్నారు. ఎస్బీఐ(SBI) ఆధార్ అప్ డేట్ పేర ఏపీకే ఫైళ్లను ఆయా నెంబర్లకు పంపించి మోసాలకు తెర లేపారు. కలకలం సృష్టించిన హ్యాకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాథమిక విచారణలో..
సీఎంవో, డిప్యూటీ సీఎంవో, మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లో వేర్వేరు శాఖల్లో పని చేస్తున్న అధికారులు, మీడియా ప్రతినిధులతోపాటు వేర్వేరు వ్యక్తులు ఉండే విషయం అందరికీ తెలిసిందే. కాగా, ఆదివారం ఈ గ్రూపుల్లో ఉన్న కొందరికి ఎస్బీఐ ఆధార్ అప్ డేట్ పేర అసలైన గ్రూప్ నుంచి వచ్చినట్టుగా మెసెజీలు వచ్చాయి. దాంతోపాటు ఏపీకే ఫైళ్లను కూడా పంపించిన సైబర్ క్రిమినల్స్ వివరాల కోసం వాటిని ఓపెన్ చేసి చూడాలంటూ సూచించారు. ఎన్నడూ లేని విధంగా సీఎంవో, డిప్యూటీ సీఎంవో, మంత్రుల వాట్సాప్ గ్రూపుల నుంచి పంపించినట్టుగా వచ్చిన ఈ మెసెజీలు, ఏపీకే ఫైళ్లను చూసి అనుమానించిన కొందరు వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రాథమిక విచారణలో సైబర్ మోసగాళ్లు ఆయా వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేసినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దంటూ పోలీసు అధికారులు సూచించారు. ఫైల్ ను ఒక్కసారి ఓపెన్ చేస్తే అది సైబర్ మోసగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు. అదే జరిగితే ఆయా ఫోన్ల సొంతదారుల బ్యాంక్ అకౌంట్లలోని నగదును ఖాళీ చేసేస్తారని చెప్పారు. అదే సమయంలో హ్యాక్ అయిన వాట్సాప్ గ్రూపులను సురక్షితం చేశారు.
Also Read: Mahindra BE Rall-E: నవంబర్ 26న ఆఫ్రోడ్ ఎలక్ట్రిక్ SUV గ్రాండ్ లాంచ్
యాంకర్ కు విచిత్ర అనుభవం
ఇదిలా ఉంటే తన ఫోన్ హ్యాక్ అయ్యిందని ఫిర్యాదు ఇవ్వటానికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళా యాంకర్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న కానిస్టేబుళ్లు ఈరోజు సండే…స్టాఫ్ ఎవ్వరూ ఉండరని చెప్పటంతో అవాక్కవటం మహిళా యాంకర్ వంతైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న మహిళ మొబైల్ ఫోన్ ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. ఆ తరువాత అర్జంటుగా డబ్బు అవసరం ఉందని ఆమె ఫోన్ లోని కాంటాక్ట్ లిస్టులో ఉన్న నెంబర్లకు మెసెజీలు పెట్టారు. నిజమే అని నమ్మిన కొందరు బంధువులు, స్నేహితులు డబ్బులను క్రెడిట్ చేశారు. ఇలా దాదాపు అయిదు లక్షల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొట్టేశారు. కాగా, డబ్బు పంపించిన వారు ఫోన్ చేసి విషయం చెప్పటంతో మహిళా యాంకర్ కు అసలు విషయం తెలిసింది.
మాపైనే కంప్లయింట్ చేస్తావా?
ఈ క్రమంలో ఫిర్యాదు ఇవ్వటానికి ఆమె సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆ సమయంలో స్టేషన్ లో ఒకరిద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. జరిగిన విషయాన్ని వివరించి కంప్లయింట్ ఇవ్వాలని యాంకర్ చెప్పగా ఈ రోజు ఆదివారం…స్టాఫ్ ఎవ్వరూ ఉండరు.. మరో రోజు రండి అన్న సమాధానం వచ్చింది. పైగా, హ్యాకింగ్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. డబ్బు పోతే మేమేం చేస్తాం.. నిజానికి మీరు అసలు బాధితులే కాదు.. డబ్బు పోగొట్టుకున్న వారు వచ్చి ఫిర్యాదు చేస్తే తీసుకుంటామని కానిస్టేబుళ్లు చెప్పారు. దాంతో యాంకర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటానికి యత్నించగా మాపైనే కంప్లయింట్ చేస్తావా? అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల సంగతేంటి? అని ప్రశ్నించారు. సైబర్ హెల్ప్ లైన్ 1930 నెంబర్ కు ఫోన్ చేసినా సరైన స్పందన రాలేదన్నారు. చాలాసేపు కాల్ ను వెయిటింగ్ లో పెట్టారని చెప్పారు.
Also Read: Medchal: వెంచర్ కోసం నాలా కబ్జానా? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నట్లు!

