– త్వరలో తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు
– అసెంబ్లీలో కీలక బిల్లుల అమోదం లభిస్తుందా?
– బిల్లుల అమోదం పొందాలంటే ఉభయ సభల మెజారిటీ కీలకం
– శాసన మండలిలో బీఆర్ఎస్ ఆధిపత్యం
– ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టబోతున్న కాంగ్రెస్
– ఇప్పటికే టచ్లోకి 11 మంది ఎమ్మెల్సీలు
– గుత్తాపై బీఆర్ఎస్ గుస్సా
Congress start operation to attract BRS 26 mlc : తెలంగాణలో పూర్తి స్థాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్నాయి. దీనికోసం పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీలో కీలక బిల్లలు ఆమోదం పొందాలంటే శాసన సభతో పాటు మండలిలోనూ ఓకే కావాల్సి వుంటుంది. అయితే, ప్రస్తుతం శాసన మండలిలో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు రాజకీయ పండితులు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్లాన్ బీ కూడా అమలు చేసే ఛాన్స్ ఉందని, గులాబీ ఎమ్మెల్సీలకు గాలం వేయొచ్చని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ నేర్పింది ఇదేగా!
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అస్తిత్వం కోల్పేయేలా చేయడానికి కేసీఆర్ ఆపరేషన్ గులాబీని ప్రారంభించి కీలక నేతలందరినీ తన పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీశారు. అలాంటి దెబ్బలు తిని మళ్లీ పుంజుకుని అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి ఎదిగింది హస్తం పార్టీ. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలోపే ఆపరేషన్ మొదలెడితే అనూహ్యంగా మండలిలో తమ బలం పెంచుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
రెండేళ్లకోసారి ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, శాసనమండలిలో ఎక్కువ మంది కాంగ్రెస్ సభ్యులు ఉండేవారు. సాధారణంగా మండలిలో రెండేళ్లకోసారి కొన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. ఎమ్మెల్సీల పదవీ కాలం కొనసాగుతూ ఉండటమే దీనికి కారణం. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మండలిలో బీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్కు 26 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్లో 6, ఎంఐఎంకు 2, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీరుగాక మరో ఇద్దరు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభా సంప్రదాయాల ప్రకారం అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రతి బిల్లు శాసనమండలికి వస్తుంది. దానిపై మండలి చర్చించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది.
కీలక బిల్లుల ఆమోదంపై అనుమానాలు
ఇకముందు కీలక బిల్లులు మండలికి వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ అండ్ టీం కు అవకాశం ఉంటుంది. ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపే తీర్మానం విషయంలోనూ మండలిలో అధికార పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరమేననే చర్చ జరుగుతోంది.
గుత్తాపై అవిశ్వాసం
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నల్లగొండ జిల్లా రాజకీయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుమారుడు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ లోక్ సభ టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని, ఈ క్రమంలోనే అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారని అంటున్నారు. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో సుఖేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతుందనే చర్చ కూడా మొదలైంది.