Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు ఓ సర్వే తేల్చింది. పెళ్లి అంటే ఊరంతా సందడి ఉండాలని మనవాళ్లు భావిస్తారు. అందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగి తీరాల్సిందేనని కృతనిశ్చయంతో ఉంటారు. ఇంట్లో పెళ్లికి కనీసం ఏడాది ముందు నుంచైనా ప్రిపరేషన్లు మొదలవుతాయి. సంబంధాలు చూడటం మొదలు.. చుట్టాలను కార్యాన్ని సిద్ధం చేస్తుంటారు. పెళ్లిని ఘనంగా చేయడమనేది పిల్లలపై ప్రేమతోపాటు సమాజంలో హోదా లేదా పరువుతోనూ ముడిపడి ఉంటున్నది. కాబట్టి, ఈ విషయంలో చాలా మంది రాజీ పడరు. పిల్లల చదవులు కోసమూ తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించాలని, ఫీజులూ ఎక్కువ మొత్తంలో చెల్లించడానికి సిద్ధపడతారు. కానీ, జెఫరీస్ అనే సర్వే తేల్చిందేమిటంటే.. చదువుల కోసం ఖర్చు పెట్టినదానికంటే కూడా పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మన దేశ:లో వివాహ పరిశ్రమ పరిమాణం రూ. 10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది.
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఓ సంచలన సర్వేను విడుదల చేసింది. భారత్లో ప్రతి యేటా 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని ఈ సర్వే తెలిపింది. చైనాలో 70 నుంచి 80 లక్షలు, అమెరికాలో 20 నుంచి 25 లక్షలుగా పెళ్లిళ్లు జరుగుతాయని వివరించింది. భారత్లో అమెరికా కంటే రెట్టింపు సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయని విశ్లేషించింది. అంతేకాదు, మన దేశంలో పెళ్లి పై సగటున రూ. 12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఖరీదైన ఆతిథ్యం, మర్యాదలు, పసందైన వంటకాలు, డెకరేషన్లు, దుస్తులు, నగలు, రవాణా, క్యాటరింగ్ వంటివి కూడా ఆడంబరంగానే ఉంటాయి. దేశంలో యేటా నమోదయ్యే మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్లిళ్ల కోసమేనని ఈ సర్వే తెలిపింది. మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఒక్కో పెళ్లిపై చదువు కంటే రెండింతలు ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. అదే అమెరికాలో విద్య పై పెట్టే ఖర్చులో వివాహ ఖర్చు సగమేనని తెలిపింది.