– ముగిసిన అధిష్ఠానం కసరత్తు
– ఏ క్షణంలోనైనా ప్రకటన
– మంత్రి వర్గ విస్తరణపై రానున్న క్లారిటీ
– కాంగ్రెస్ నుంచి గెలిచినోళ్లకే మంత్రులుగా ఛాన్స్
AICC Exercise On PCC New President in Telangana : తెలంగాణ పీసీసీ పదవి కోసం పార్టీ అధిష్ఠానం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసిసి కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ సీనియర్లు, మంత్రులతో ఏఐసిసి నేతలు గత రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహించారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.
పూర్తయిన వడపోత
ఈ క్రమంలో శుక్రవారం జరిగిన భేటీలో పీసీసీ కొత్త సారథిపై పార్టీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆశావహుల్లో బీసీ వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధు యాష్కీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించగా, తాజాగా, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎస్టీ కోటా నుంచి మంత్రి సీతక్క, ఎస్సీ కోటాలో సంపత్ కుమార్ పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా , తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
మంత్రిపదవులపైనా క్లారిటీ
కాంగ్రెస్ బీ-ఫామ్ మీద గెలిచినోళ్లకే మంత్రి పదవులు దక్కుతాయని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ ఛీఫ్, కేబినెట్ విస్తరణపై నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయన్నారు. పీసీసీ చీఫ్ నియామకంపై సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ‘బాగానే ఉంటుంది’ అంటూ.. ‘పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చు. సామాజిక న్యాయంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు, మహిళలు ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా ఉండొచ్చు’ అని బదులిచ్చారు.