- కీలక నిర్ణయాల దిశగా రేవంత్ సర్కార్ అడుగులు
- తక్షణ ఆదాయ మార్గాలపై దృష్టి
- తాత్సారం లేకుండా నూతన భవన నిర్మాణాలకు అనుమతులు
- హెచ్ఎండీఏ సహకారంతో భారీగా నిధుల సమీకరణ
- మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన హెచ్ఎండీఏ
- ఇప్పటికే 111 జీఓ ఎత్తివేత
- సీఎల్యూ కోసం వేల సంఖ్యలో అప్లికేషన్లు
- కొత్త వెంచర్ల కోసం క్యూ కడుతున్న రియల్ వ్యాపారులు
Congress plan to increase income hmda clu applications:
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతోంది. అటు పాలన. ఇటు పథకాల అమలు లో దూకుడు ప్రదర్శిస్తోంది.
ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ కు మంచి ఊపు రావడమేగాక రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పెరగనుంది. భాగ్యనగరంలో భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో సొంతింటి కలలను సాకారం చేసుకునే దిశగా మధ్యతరగతి వర్గం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వర్గాల అవసరాలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆకర్షణీయ మరియు అందుబాటు ధరలతో వారికి చేరువవుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే నగరంలో భారీ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త వెంచర్లు, బహుళ అంతస్తుల భవంతుల అనుమతుల కోసం నిర్మాణదారులు క్యూ కడుతు్నారు. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలతో హెచ్ఎండీఏ కూడా తమ ఆదాయ వనరులపై నజర్ పెట్టింది. కొన్ని కీలక ప్రాజెక్టులను చేపట్టనుంది.
తక్షణమే ఆదాయం రావాలంటే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి..వచ్చీ రాగానే సంక్షేమ పథకాలు, గ్యారెంటీలపై దృష్టి పెట్టింది. ఈలోగా ఎన్నికల కోడ్ రానే వచ్చింది. ఇక ఫలితాల తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తేవేస్తారు. అందుకే కాంగ్రెస్ సర్కార్ తగిన ఆదాయ వనరులపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుత పరిస్థితిలో ఆదాయాన్ని పెంచుకునే వనరుగా హెచ్ ఎండీఏ సంస్థ కనిపిస్తోంది. ఈ సంస్థ ద్వారా భారీగా నిధులను సేకరించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అందుకే గత కొంత కాలంగా నిలిపివేసిన భూ మార్పిడులను మళ్లీ తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించారు. గతంలో జరిగిన అవినీతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్న దరఖాస్తులకు అనుమతులు ఇస్తే సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్
మాస్టర్ ప్లాన్ లో భాగంగా 111 జీఓ ఎత్తివేయడంతో సీఎల్యూ కోసం హెచ్ ఎండీఏ కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. సీఎల్యూ అంటే ఒక జోన్ నుంచి మరో జోన్ లోకి మార్పు చేయాలంటే సీఎల్యూ తప్పనిసరిగా ఉండాలి. వాటిని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు నిర్ణయించారు.
మాస్టర్ ప్లాన్లో 12 జోన్లు
హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్లో 12 జోన్లు ఉన్నాయి. 111 జీఓ ప్రాంతాల్లోని 84 గ్రామాలను ఏ జోన్లోకి తీసుకోలేదు. ఈ భూములన్నీ ఆంక్షల మధ్య బయో కన్జర్వేషన్ జోన్లోనే ఉన్నాయి. అయితే వీటికి నాలా కన్వర్షన్కు ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉండడంతో .. సీఎల్యూ కింద రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా కోరుకున్న జోన్లకు మార్పు చేయాలని పలువురు యజమానులు అప్పట్లో హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లోనూ కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లకు మార్చాలని కొన్ని దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ఈ విషయంలో హెచ్ఎండీఏ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.