– గేట్లెత్తిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ వలసలు షురూ
– హస్తం అందుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
– కాంగ్రెస్ ఆకర్ష్తో ఆగమవుతున్న గులాబీ పార్టీ
– పక్కచూపులు చూస్తున్న మరో 11 మంది
– బీఆర్ఎస్ఎల్పీ విలీనమే లక్ష్యంగా హస్తం అడుగులు
– రేపటికి ఎవరుంటారో లేదో తెలియని పరిస్థితి
– మౌనంగా పరిస్థితులను గమనిస్తున్న కమలనాథులు
BRS MLA Kale Yadaiah Joins Congress Party : అనుకున్నట్లే అయింది. పార్లమెంటు ఎన్నికల్లో సున్నాకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మళ్లీ మొదలయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం, కవిత అరెస్టు, పార్టీ ప్రతిష్ఠను అధ: పాతాళానికి తీసుకుపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్లలో పార్టీ నేతల అక్రమాలు.. గులాబీ పార్టీకి శాపాలుగా మారటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి జారుకుంటున్నారు. తాజాగా, శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీకి గుడ్బై చెప్పి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దల చేతుల మీదగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు మరో 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారని వార్తలు రావటంతో శాసన సభ్యులను ఫామ్హౌస్కి పిలిచి, అధినేత బుజ్జగిస్తున్నా.. వలసలు ఆగటంలేదు. దీంతో రేపటికి పార్టీలో ఎవరుంటారో లేదోననే పరిస్థితి ఏర్పడటం పార్టీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు.
ఆగని వలసలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమై విపక్షంలో కూర్చున్న సంగతి తెలిసిందే. కాగా, లోక్సభ ఎన్నికలకు ముందే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్లో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణీ కూడా కొట్టలేకపోవటం, మొత్తం 17 ఎంపీ సీట్లలో ఏకంగా 8 సీట్లలో డిపాజిట్ కోల్పోవటం, కేవలం రెండు సీట్లలోనే రెండో స్థానంలో నిలవటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. దీంతో మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్లు కాంగ్రెస్లో చేరగా, శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 32కి పడిపోయింది.
ఫలించని బుజ్జగింపులు
లోక్సభ ఎన్నికల వరకు పార్టీ మారిన వారి విషయంలో పెద్దగా కంగారు పడని గులాబీ బాస్.. తాజా వలసలతో తలకిందులైపోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ స్పీకర్ పోచారం వంటి సీనియర్ నేత కూడా కాంగ్రెస్లోకి వెళ్లిపోవడంతో అటు గులాబీ బాస్తో బాటు పార్టీ ఎమ్మెల్యేలూ ఒక్కసారిగా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. పోచారం, సంజయ్ కుమార్ పార్టీ మారిన తర్వాత మరో 11మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలతో కేసీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగి గురువారం ఎమ్మెల్యేలను పిలిపించుకుని బుజ్జగించారు. కానీ, శుక్రవారమే చేవెళ్ల ఎమ్మెల్యే పార్టీ మారటంతో గులాబీ పార్టీ నేతలు షాక్కు గురయ్యారు.
కోర్టు ద్వారా కట్టడికి వ్యూహాలు
తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించి, వారిపై అనర్హత వేటు వేయించే వ్యూహానికి కూడా గులాబీ పార్టీ సిద్ధమైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయాలంటూ అటు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ ప్రయత్నమేదీ వలసలను ఆపలేకపోతోంది. పార్టీ మారిన వారిపై సదరు పార్టీ అనర్హత వేటు వేయాలని కోరితే, స్పీకర్ మూడు నెలలలో నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నప్పటికీ అది ఆచరణలో ఏ మేరకు అమలవుతుంతో నమ్మకం లేదనే భావనతోనే ఎమ్మెల్యేలు ధైర్యంగా పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. 2014, 2018అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ, కాంగ్రెస్ల నుంచి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకున్నా.. వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయని సంగతి తెలిసిందే.
హస్తం పార్టీ రిటర్న్ గిఫ్ట్
కాంగ్రెస్లో చేరబోతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు గులాబీ బాస్ చేస్తున్న లీగల్ ఫైట్ ఫలించకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు ముందుగానే ప్రతివ్యూహన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొత్తం 38 మందిలో 26 మందిని తమవైపుకు తిప్పుకొంటే, తర్వాత బీఆర్ఎస్ పార్టీ విలీనం దానంతట అదే జరిగిపోతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తద్వారా ఫిరాయింపు చట్టంతో తమకు ఎలాంటి ఇబ్బందులు రావని వారి యోచనగా కనిపిస్తోంది. 2014లో టీడీఎల్పీని, 2018లో సీఎల్పీని విలీనం చేసుకుని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన కేసీఆర్కు ఈ విధంగా రిటర్న్ గిఫ్టు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు గట్టి పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
బీజేపీకి చెక్.. పెట్టేందుకేనా?
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు, ఓట్ల శాతం పెంచుకుని రాజకీయంగా ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచి ఏడు స్థానాల్లో రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంపై గురి పెట్టింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలపై, జిల్లాల్లో పట్టణ ప్రాంత ఎమ్మెల్యేలపై కాషాయ పార్టీ కన్నేసింది. చేరికల కోసం ఈడీ, ఐటీ దాడులతో బీఆరెస్ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవాలనే బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ యత్నాలను పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ గేరు మార్చి ఆపరేషన్ ఆకర్ష్కు సిద్ధమైంది. ఈ దెబ్బతో అటు.. బీజేపీని కట్టడి చేయటమే గాక బీఆర్ఎస్ను చావుదెబ్బ కొట్టాలని హస్తం నేతలు భావిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో కరువైన ఆదరణ
సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఏ పార్టీ అయినా ఢిల్లీ మద్దతు కోరటం తెలిసిందే. కానీ, బీఆర్ఎస్ పార్టీ అధినేత వైఖరితో ఢిల్లీలోని ఏ పార్టీ ఆయనను నమ్మటం లేదని తెలుస్తోంది. ఈ దిశగా ఢిల్లీలో గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి స్పందనా లేదని తెలుస్తోంది. అటు బీజేపీ సైతం.. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అంతర్థానమై, తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ముఖాముఖి పోరు సాగితే తమకు అధికారం తథ్యమని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం.
వలసలపై నెటిజన్ల స్పందన
వలసలతో పరేషాన్ అవుతున్న గులాబీ పార్టీ పట్ల అటు ప్రజల్లోనూ సానుభూతి కరువైంది. ఫిరాయింపులపై కేటీఆర్ పెట్టిన ట్వీట్ మీద నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హిస్టరీ రిపీట్ అవుతుందన్న కేటీఆర్కు 2014,2018లో నాటి టీడీపీ, కాంగ్రెస్ ఎల్పీలను విలీనం చేసినప్పుడు మీకు హిస్టరీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
పోతే పోనీ
వరుస వలసలను ఆపే క్రమంలో శుక్రవారం ఫామ్ హౌస్లో కేసీఆర్… కోరుట్ల, జగిత్యాల నియోజక వర్గాల నుంచి వందలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నుంచి పోయి దొంగల్లో కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన పనిలేదని, ఒకరు పోతే వందమందిని తయారు చేయగల శక్తి పార్టీకి ఉందని ఆయన నేతలకు భరోసా ఇచ్చారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తమ పార్టీకి ఈ పరిస్థితి ఒక లెక్కేమీ కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించాల్సిన ప్రగతి ఇంకా ఎంతో ఉందని, దానికోసం బీఆర్ఎస్ తప్పక పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా బీఆర్ఎస్కు మాత్రమే ఉందని, కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలను త్వరలోనే ప్రజలు ప్రతిఘటిస్తారని అన్నారు.