- భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆవరణలో దుర్ఘటన
- రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా డ్యామేజీ?
- ఘటనా స్థలంలో కార్మికులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
- లైట్నింగ్ పనితీరుపై ఉద్యోగుల్లో అనుమానాలు
- మంటలను అదుపులోకి తేలేకపోయిన ఫైరింజన్ సిబ్బంది
- డ్రై కెమికల్ పౌడర్ తో అదుపులోకి వచ్చిన మంటలు
- నిలిచిపోయిన 270 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి
- ప్రమాదం తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా
Thunder effect on btps 270 megawats units current production stoped
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆవరణలో శనివారం అర్థరాత్రి పిడుగు పడింది. ఈ ప్రమాదంలో పిడుగు సరిగ్గా జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్పై పడటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనలో రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అయితే, యూనిట్-1 పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయంటూ అపవాదును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా దుర్ఘటన కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది.
బీటీపీఎస్ ట్రాన్స్ ఫార్మర్ దగ్ధం
బీటీపీఎస్లోని మొదటి యూనిట్ కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పై ఒక్కసారిగా పిడుగు పడడంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయి మంటలు వ్యాపించాయి. మొదటి యూనిట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తును జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా స్విచ్ యార్డుకు పంపిస్తారు. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కు అగ్నిప్రమాదం జరగడంతో 270 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ ను షట్ డౌన్ చేశారు. ముందుజాగ్రత్తగా పక్కనే ఉన్న రెండో యూనిట్ను కూడా షట్డౌన్ చేశామని ఉద్యోగులు తెలిపారు. కాగా.. జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ కు అంటుకున్న మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్ వల్ల సాధ్యం కాకపోవడంతో డ్రై కెమికల్ పౌడర్ వినియోగించారు. గంటన్నరపైగా ఫైర్ సిబ్బంది, ప్లాంటు ఉద్యోగులు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. పిడుగు పడిన టైంలో ఆ ప్రాంతంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోవడంతో సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఉద్యోగులు పేర్కొన్నారు.
లైట్నింగ్ అరెస్టు పనితీరుపై అనుమానాలు
బీటీపీఎస్లోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పై పిడుగు పడడంపై అధికారులతో పాటు కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, సబ్ స్టేషన్ల సమీపంలో పిడుగులు పడకుండా లైట్నింగ్ అరెస్టులను (రాడ్) ఏర్పాటు చేస్తారు. బీటీపీఎస్లోనూ లైట్నింగ్ అరెస్టులను ఏర్పాటు చేశామని ప్లాంట్ అధికారులు పేర్కొంటున్నారు. లైట్నింగ్ పనితీరుపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్లాంటులో పిడుగులను అడ్డుకునే లైట్నింగ్ల ఏర్పాటు, వాటి పనితీరు, పర్యవేక్షణ విషయంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం కనిపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడడంతో 270 మెగావాట్ల యూనిట్లఉత్పత్తి నిలిచిపోయింది. తిరిగి ఉత్పత్తి కావడానికి దాదాపు నెలకుపైనే పట్టే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
మంత్రి తుమ్మల ఆరా
ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీటీపీఎస్ సీఈ బిచ్చన్న కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తుమ్మలకు సీఈ వివరించారు. పిడుగుపాటును అడ్డుకునే లైట్నింగ్ అరెస్టులు ఉన్నా ఇలా జరగడంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.