Bengaluru school introduces lesson on actress Tamannaah Bhatia draws parents ire:
ఒకప్పుడు పురాణ పురుషులు, చారిత్రక యోధులను పాఠ్యాంశాలలో చేర్చడం ఆనవాయితీ. ఇప్పుడు ఏకంగా సినిమా నటులను సైతం పాఠ్యాంశంలో చేర్చడం కామన్ గా మారింది. అయితే టాలీవుడ్ సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడంపై బెంగళూరులో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలపై బాలల హక్కుల రక్షణ సంఘానికి వారు ఫిర్యాదు కూడా చేశారు. విషయం ఏమిటంటే పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఏడో చాప్టర్లో సింధీ వ్యక్తుల గురించి అంశాన్ని పొందుపరిచారు. ఇందులో నటి తమన్నా భాటియా, నటుడు రణ్వీర్ సింగ్ గురించి పాఠ్యాంశంగా చేర్చారు. పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. పైగా దీనిని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు.
రచ్చ చేయొద్దు
ఈ విషయాన్ని రచ్చచేయొద్దని తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను ఇచ్చినట్లు తెలిపింది. స్వాతంత్య్రం అనంతరం సింధూ ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు..అంతేగానీ వేరే ఉద్దేశం లేదని తెలిపింది.