Liquor Scam: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గాలింపును తీవ్రం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు హైదరాబాద్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కసిరెడ్డికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ప్రదేశాల్లో సోమవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
Also Read: Bhu Bharati Portal: బాబోయ్.. భూ భారతి పోర్టల్ ను ఇంత బాగా డిజైన్ చేశారా? ఆ సమస్యలు తీరినట్లే!
కాగా, మద్యం కుంభకోణం దర్యాప్తులో కసిరెడ్డి పాత్ర కీలకమని సిట్ అధికారులు మొదట్నుంచీ భావిస్తున్నారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ కసిరెడ్డి కనీసం స్పందించలేదు. పలుమార్లు విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని సిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులిచ్చారో చెప్పాలని సిట్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో కసిరెడ్డికి తగినంత సమయమిస్తూ ఏప్రిల్ 9న విచారణకు రావాలని నాలుగు రోజుల ముందే సిట్ నోటీసులిచ్చింది. ఈసారి కూడా ఆయన విచారణకు రాలేదు, ఎక్కడ తనను ఫోన్లు ట్రేస్ చేస్తారో అని స్విచ్ఛాఫ్ చేసేసి పరారైపోయారు.
దొరికితే..?
అయితే, ఈ కుంభకోణం వెనుక ఉన్న కీలక సూత్రధారులు, పాత్రధారుల వివరాలు రాబట్టాలంటే కసిరెడ్డి విచారణ అత్యంత ముఖ్యమని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, హైదరాబాద్లో మొత్తం 10 నుంచి 15 ప్రత్యేక సిట్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తున్నది. రాజ్ కసిరెడ్డి నివాసం, అరేటా హాస్పిటల్, కార్యాలయంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్లటారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల ద్వారా ఆచూకీ గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవాళ, రేపు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి ఆచూకీ తెలిస్తే కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించవచ్చని సిట్ వేట సాగిస్తోంది. అంతేకాదు ఈ కుంభకోణం గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. కసిరెడ్డి దొరికితే తక్షణమే అదుపులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైసీపీ హయాంలో రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుగా వ్యవహరించారు.