Borugadda: వైసీపీ(YCP) నేత బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) కోసం పోలీసులు(Police) గాలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించిన కేసులో బోరుగడ్డ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనపై పలు కేసులు నమోదు కాగా, అనంతపురం పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో ఆయన రాజమండ్రి(Rajahmundry) జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో ఇటీవలే ఆయనకు మధ్యంతర బెయిల్(Bail) కూడా వచ్చింది. అయితే బెయిల్ పొందేందుకు ఆయన హైకోర్టును తప్పుదారి పట్టించినట్లు పోలీసులు కనిపెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తల్లికి అనారోగ్యంగా ఉందని ఓ ఫేక్ సర్టిఫికేట్ సమర్పించి ఆయన బెయిల్ పొందినట్లు గుర్తించారు.
బిహైండ్ ది బెయిల్… ఏం జరిగింది?
రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)లో రిమాండ్లో ఉన్న బోరుగడ్డ అనిల్ తన తల్లి పద్మావతికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆమెను చూసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 14న హైకోర్టు (High Court)లో పిటిషన్ వేశారు. పరిశీలించిన కోర్టు… ఆయనకు ఫిబ్రవరి 15 నుంచి 28వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 28వ తేది సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశించినట్లుగా బోరుగడ్డ లొంగిపోయాడు కూడా.
పొడిగింపు..
అయితే… మార్చి 1వ తేదీన అనిల్ కుమార్ మరో పిటిషన్ వేశారు. అదేంటంటే… తన తల్లికి తాను ఒక్కడినే కొడుకునని, ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆమెకు ట్రిట్మెంట్ జరుగుతున్నందున మరికొన్ని రోజులు వైద్య సహాయం అవసరం ఉందని కాబట్టి తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కోరారు. అందుకు ఆధారంగా… గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన చీఫ్ కార్డియాలజిస్టు ఇచ్చారంటూ మెడికల్ సర్టిఫికెట్ ను కోర్టుకు సమర్పించారు. అందులో అనిల్ తల్లి పద్మావతి ఆరోగ్యం క్షీణించిందని, చికిత్స నిమిత్తం చెన్నై అపోలోకు తరలించాలని ఉంది.
దాన్ని కోర్టు పరిశీలించింది. వాదనల సందర్భంగా పోలీసుల తరఫున వాదనలు వినిపించిన ఏపీపీ ఆ సర్టిఫికెట్ పై అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వాదనలతో ఏకీభవించిన జడ్జీ… సర్టిఫికెట్ ఒరిజినలా? కాదా? అని తేల్చాలని పోలీసులను అనుమతి ఇచ్చారు. ఒకవేళ తప్పు అని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ మేరకు మార్చి 11వ తేదీ వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం ఆరా తీసిన పోలీసులకు అది ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసిపోయింది. ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చినట్లు చెప్పారో సదరు డాక్టరు కూడా వాంగ్మూలం ఇచ్చారట. తాను ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదంటు. దీంతో అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు బోరుగడ్డ కోసం గాలిస్తున్నారు.