AP Govt: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ నుంచి త్వరలో నూతనంగా అందించబోతున్న క్యూ ఆర్ కోడ్ రేషన్ కార్డుల వివరాలు వెల్లడించారు.
మే నుంచి క్యూ ఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో ఏటీఎం కార్డు సైజులో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. ‘ కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తాం. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక కొత్తగా ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలి? అనేది స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే కొత్త కార్డులు జారీ చేస్తాం. కుటుంబ సభ్యుల వివరాలున్నీ ఈ కార్డ్లో ఉంటాయి. రేషన్ కార్డు అని కాకుండా ఫ్యామిలి కార్డుగా ఉంటుంది. ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్గా రేషన్ కార్డు ఉంటుంది’ అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇక సన్న బియ్యంతో బువ్వ!
‘ స్కూళ్లు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోలు చేశాం. రైతుకు భరోసా కల్పించేలా 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ కూడా చేశాం. రైతులకు ఏ మిల్లుకు కావాలంటే ఆ మిల్లుకు ధాన్యం అమ్ముకునే వెసులుబాటును కల్పించాం. గత ప్రభుత్వం కన్నా 20 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు జరిగింది. బియ్యం అక్రమ రవాణాలో 65 వేల మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. బియ్యం తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేయమని ఆదేశాలిచ్చాం.
Also Read: Kisan Yatra: రైతుల కోసం సరికొత్త యాత్ర.. ఊరూరా స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
గతంలో ఎప్పుడు లేని విధంగా బియ్యం సీజ్ చేశాం. మిల్లర్ అసోసియేషన్తో కూడా ఇప్పటికే సమావేశాలు పెట్టాం. కాకినాడలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు పోలీసులు, అధికారులు చెకింగ్ చేస్తున్నారు. దీపం-2 పథకం గత దీపావళి రోజు ప్రారంభమైంది. తొలి దశలో 99 లక్షలకు మందికి పైగా వినియోగించుకున్నారు. రెండో విడత కూడా ప్రారంభమైంది. ఈ కేవైసీ నమోదు తప్పనిసరి. క్యూలో నిలుచునే అవసరం లేకుండా ఈ పాస్ నుంచి కూడా ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు. కోటి మందికి పైగా దీపం పథకం లబ్ధిదారులు అవుతారని భావిస్తున్నాం’ అని మంత్రి నాదెండ్ల మీడియాకు వివరించారు.