Chandrababu: ఇదిగో ఈ ఫొటోలో చూస్తున్న బాలుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనసు గెలుచుకున్నాడు. పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం బాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు సభావేదికపైకి వచ్చి ప్రసంగించారు. అయితే ఇందులో ఓ బాలుడు చేసిన ప్రసంగానికి చంద్రబాబు ఫిదా అయ్యారు. దీంతో స్వయంగా బాలుడ్ని దగ్గరికి తీసుకొని అభినందించారు. అంతేకాదు వేదికపైనే శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ అరుదైన, ఆత్మీయ అభినందనకు ఆనంద భాష్పాలతో సీఎం ఆశీస్సులు తీసుకున్నాడు. భావోద్వేగానికి లోనైన బాలుడిని దగ్గరకు తీసుకుని, బాగా చదువుకుని ప్రయోజకుడివి అవ్వాలని బాబు ఆశీర్వదించారు. అంతకుమందు పాఠశాల ఆవరణలో విద్యార్ధులతో కలిసి చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ చేశారు. విద్యార్ధుల నుంచి వివరాలు తెలుసుకుంటూ సీఎం భోజనం చేశారు. విద్యార్ధులకు పెడుతున్న ఆహార పదార్ధాల నాణ్యత, రుచి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లితండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.
నేను వెళ్లలేకపోయా..
‘ పాఠశాల అనేది విద్యను అందించే దేవాలయం. ఈ ఆధునిక దేవాలయాలను రక్షించుకునే బాధ్యత మన అందరిదీ. ఈ స్థాయిలో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్న విద్యా శాఖ మంత్రి లోకేష్ను అభినందిస్తున్నా. తల్లితండ్రుల తర్వాత ఉపాధ్యాయుడినే ఆరాధించటం మన సంప్రదాయం. గురుపౌర్ణమి రోజున రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలల్లో 2.28 కోట్ల మందితో ఈ సమావేశం నిర్వహించుకోవడం సంతోషం. లోకేష్ పాఠశాలలో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ నేను ఎప్పుడూ వెళ్లలేకపోయా. నా సతీమణి భువనేశ్వరి ఏ సమావేశాన్నీ విడిచిపెట్టకుండా వెళ్లి లోకేష్ను కేంబ్రిడ్జి వరకూ చదివించటంలో శ్రద్ధ పెట్టారు. డ్వాక్రా సంఘాలకు పొదుపు నేర్పించి కుటుంబ ఆదాయం పెరిగేలా చేశాం. మహిళల పొదుపు కోసం బలమైన వ్యవస్థకు రూపకల్పన చేసి అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చాం. కుటుంబంలో ఉన్న ప్రతీ పిల్లవాడినీ చదివించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తింప చేశాం. ఎంతమంది ఉన్నా వారందరికీ ఈ పథకాన్ని అందించి ఆ కుటుంబాల్లో వెలుగులు తీసుకువచ్చాం. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ బాధ్యతను లోకేష్ ఏరికోరి తీసుకున్నారు. స్టాన్పర్డ్ లాంటి విద్యా సంస్థలో చదువుకున్న లోకేష్ రాష్ట్రంలోని విద్యార్ధులందరి భవిష్యత్తు తీర్చిదిద్దుతారని ఈ బాధ్యత అప్పగించాం. మొదటి దఫా పేరెంట్ టీచర్ మీటింగ్ను 44 వేల పైచిలుకు పాఠశాలల్లో నిర్వహించాం. ఈసారి ప్రైవేటు స్కూళ్లలోనూ వీటిని నిర్వహించాలని ఆదేశించాం’ అని చంద్రబాబు తెలిపారు.
Read Also- YS Jagan: చంద్రబాబూ.. ఎందుకింతలా దిగజారిపోయారు?
నాకూ చదువుకోవాలని ఉంది!
‘ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ప్రైవేటు స్కూల్లకు ధీటుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. నెల్లూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఖాళీలేవని నోవేకెన్సీ బోర్డు పెట్టారంటే నాణ్యత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0కు 2.28 కోట్ల మంది హాజరయ్యారు. గిన్నీస్ రికార్డు సాధించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తల్లిపేరిట ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకున్నాం. వారికి గ్రీన్ పాస్ పోర్టు కూడా ఇచ్చాం. తల్లితండ్రులు లీప్ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. విద్యార్ధుల హాజరు, వారికి వచ్చిన మార్కులు, ప్రవర్తన అన్నీ యాప్ ద్వారా సమాచారం ఇస్తున్నాం. విద్యార్ధులకు మంచి నాణ్యమైన యూనిఫాం, బూట్లు, బెల్టు, బ్యాగ్ ఇచ్చారు. మిమ్మల్ని చూస్తే నాకూ చదువుకోవాలని ఉంది. విద్యార్ధులకు ఇచ్చిన కిట్లపై ఎలాంటి వ్యక్తుల ఫోటోలు పెట్టలేదు. రు.980 కోట్లు వీటి కోసం వ్యయం చేశాం. నా చిన్నతనంలో నా తల్లి పొట్లాం కట్టిస్తే ఆరు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లాను. ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది లేకుండా నాణ్యమైన సన్న బియ్యంతో మద్యాహ్న భోజనం పెడుతున్నాం. విద్యాశాఖను మెరుగు పర్చడానికి తల్లితండ్రులు, ఉపాధ్యాయుల అందరి సూచనలూ తీసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఏజెన్సీలో గంజాయి పెద్ద ఎత్తున పండించారు. డ్రగ్స్, గంజాయి విక్రయించినా పండించినా అదే వారికి చివరి రోజు. డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ద్వారా దీన్ని నియంత్రించే డ్రగ్స్, గంజాయి విక్రయించే వారి ఆస్తిని కూడా స్వాధీనం చేసుకుంటాం. డ్రగ్స్ , గంజాయి విక్రయించేవారి కుటుంబాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా నిలుపుదల చేస్తాం’ అని చంద్రబాబు తేల్చి చెప్పేశారు.
మాట నిలబెట్టుకుంటాం..
‘ విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేలా కార్యక్రమాలు చేస్తున్నాం. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు మనకు స్పూర్తి కావాలి. గతంలో 12 సార్లు డీఎస్సీలు చేసి 1.66 లక్షల మందిని ఉపాధ్యాయులను నియమించాం. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా చేపట్టలేదు. అద్యాఫకులు లేకుండా సంస్కరణలు ఏమిటి? గత ప్రభుత్వ హయాంలో టోఫెల్ అన్నారు. ఐబీ సిలబస్ అన్నారు. ఒక్కటి కూడా అమలు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక మెగాడీఎస్సీ నిర్వహించి 16,347 మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నాం. ఆగస్టు నాటికల్లా వారంతా పాఠశాలలకు వస్తారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. 40 లక్షల మంది పైచిలుకు తల్లులకు తల్లికి వందనం పథకం అందించాం. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. దాని అసలు తీర్చాలి, వడ్డీలు కట్టాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్ధుల్లో ప్రతిభను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ అని అవార్డులు ఇస్తున్నాం. షైనింగ్ స్టార్స్ ఉన్న విద్యార్ధుల అందరికీ నచ్చిన కాలేజీల్లో చదువుకునేలా ప్రణాళిక చేస్తాం. పుట్టపర్తిలో స్టేడియం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తాం. ఇక అంతా హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలి. ఐటీ వల్ల మన తెలుగువాళ్లు దేశవిదేశాల్లో బాగా సంపాదించగలుగుతున్నారు. పిల్లలను బాగా చదివిస్తే ఊహించని విధంగా వారి జీవితాల్లో మార్పు వస్తుంది. భవిష్యత్ అంతా నాలెడ్జ్ ఎకానమీదే. దానికి అనుగుణంగా మన విద్యార్ధులను తీర్చిదిద్దాలి’ అని చంద్రబాబు తెలిపారు.
Read Also- Viral News: ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. తల్లి ఇప్పుడెలా ఉన్నారంటే?