Lady Aghori on Mark Shankar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ నిన్న ప్రత్యేక విమానంలో తన కుమారుడిని చూసేందుకు సింగపూర్ కు వెళ్లారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సైతం సింగపూర్ కు వెళ్లారు. మార్క్ శంకర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడిందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్ లోని ఓ పాఠశాల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాల పాలవగా, స్థానిక సిబ్బంది శంకర్ ను హుటాహుటిన వైద్యశాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కుమారుడి ఆరోగ్యం కుదుట పడాలని రాజకీయాలకు అతీతంగా నాయకులు కోరుకుంటూ పవన్ కు ధైర్యం చెప్పారు.
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి సైతం పవన్ బిడ్డ గురించి ఓ వీడియోను విడుదల చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచేందుకు ఈ కామెంట్స్ చేస్తున్నట్లు అఘోరీ చెప్పారు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని, కేవలం చిన్నారులకు జరిగిన ఘటనపై తన స్పందన అంటూ లేడీ అఘోరీ చెప్పుకొచ్చారు.
అసలేం చెప్పారంటే.. పవన్ కుమారుడికి ఆరోగ్యం కుదుటపడుతుందని, తాను రాత్రి ఒక పూజ చేసినట్లు చెప్పారు. చిన్నారులు ఉన్న పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరమని, గాయపడ్డ ప్రతి చిన్నారి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి దేవుని దయతో ప్రమాదం తప్పిందని, మళ్లీ కోలుకొని ఆరోగ్యం కుదుట పడుతుందన్నారు. అయితే గతంలో తాను పవన్ కళ్యాణ్ ను కలవాలని మంగళగిరిలో లేడీ అఘోరీ హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: SI Sudhakar Yadav: జగన్ కు గోరంట్ల మాధవ్ స్టైల్ వార్నింగ్ ఇచ్చిన ఎస్సై.. మనుషులమేనంటూ..
పవన్ బిడ్డ కోసం పూజలు..
పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని జనసైనికులు ఆయా జిల్లాలలో పూజలు నిర్వహిస్తున్నారు. అల్లూరి జిల్లాలో పవన్ పర్యటన సమయంలో పవన్ కు ఈ విషయం తెలియడంతో అక్కడి గిరిజనులు, పవన్ కుమారుడి కోసం పూజలు సాగిస్తున్నారు.