YS Jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో భూతద్ధం పెట్టి వెతికినా పోలీసులు కనబడలేదని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేతపై కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెర లేపిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్ వేసిందని.. జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. జగన్ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసిందని.. వైసీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారన్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి? చంద్రబాబు సర్కార్ ఆదేశాల మేరకే జగన్ పర్యటనకు బందోబస్తును ఏర్పాటు చేయలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ పల్నాడుకు వెళ్తున్న సమయంలో పోలీసులు కనీసం రోడ్ క్లియర్ చేయకపోవడంతో 6 గంటల పాటు ఆలస్యమైందని చెబుతున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్ కాన్వాయ్కు ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు అడ్రస్ లేకుండా పోవడం గమనార్హం. కాన్వాయ్తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై ఎక్కడా ఖాకీలు కనబడకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధినేత కాన్వాయ్కు ముందు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నానిలు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నేతలు చెబుతున్నారు.
Read Also- YS Jagan: అల్లు అర్జున్ లాగే వైఎస్ జగన్ను కూడా అరెస్ట్ చేస్తారా?
దారిపొడవునా అభిమానమే..!
ఇదిలా ఉంటే.. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా దారిపోడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. అభిమాన నేతతో కరచాలనం చేసేందుకు, ఆయన్ను దగ్గర నుంచి చూసేందుకు ఎగబడ్డారు. గుంటూరు వై జంక్షన్లో వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు దారిపొడవునా ‘జై జగన్.. జైజై జగన్.. సీఎం జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఏ రోడ్డు చూసినా జగన్కు అభిమానం ఉప్పొంగింది. ఊరూరా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి జగన్కు స్వాగతం పలికారు. మార్గమధ్యలో అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. మాజీ సీఎం రాకతో సత్తెనపల్లి పట్టణం జనసంద్రమైంది. కిలోమీటర్ల పొడవునా జనం బారులు తీరి అభిమాన నేతకు స్వాగతం పలికారు. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. బైకులు, కార్లలో వైసీపీ శ్రేణులు భారీగా వచ్చారు. మరోవైపు జగన్ను చూసేందుకు రోడ్డు పక్కన బిల్డింగులు ఎక్కి నినాదాలు చేశారు. జగన్పై అభిమానాన్ని అడ్డుకోలేక పోయిన ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా.. పోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు జనం కదిలివచ్చారని నేతలు చెబుతున్నారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వరకు ఎక్కడ చూసినా జనమే కనిపించారు.
ఎంతవరకూ కరెక్ట్?
అంతకుముందు.. జగన్ పల్నాడు జిల్లా పర్యటనను కూటమి ప్రభుత్వం ఆంక్షలతో అడ్డుకోవడాన్ని ఎవరూ హర్షించరని వైసీపీ నేతలు మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నేత బాలసాని కిరణ్కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే జగన్ను ఆంక్షలతో అడ్డుకోవాలని చూడడాన్ని ఎవరూ హర్షించరు చంద్రబాబు? అని, ఇప్పటికైనా కుట్రలు చేయడం ఆపాలని హితవు పలికారు. మరోనేత దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస రాజ్యమా? అని కూటమి సర్కార్ను ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ జనాదరణ కలిగిన నాయకుడిని ఇలా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి అడ్డుకోవాలని చూడడం అవివేకం అని, జగన్ జనం గుండెల్లో ఉన్నారని అక్కడి నుంచీ ఎవరూ తీయలేరని వ్యాఖ్యానించారు. దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ.. జగన్ పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు పెట్టడం కరెక్టా?, మూడు వాహనాల్లోనే వెళ్లాలని.. అందులోనూ 100 మందికే అనుమతి ఇస్తామనడం ఎంతవరకూ కరెక్ట్? ప్రజాదరణ కలిగిన నాయకుడిని ఇలా అడ్డుకుంటారా? ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని చంద్రబాబుకు సూచించారు.
Read Also- YS Jagan: చంద్రబాబు-జగన్ మధ్య ‘కమ్మ’ ఫైట్.. అభ్యంతరమేంటి?