కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)తో ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రమంత్రికి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాజ్ నాథ్ సింగ్ కి విజ్ఞప్తి చేశారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు.
Also Read : High BP: 5 నిమిషాల వ్యాయామం.. హై బీపీ మాయం
గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని లోకేష్ కేంద్రమంత్రికి వివరించారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్ కు తెలిపారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ.10లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని అంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏపీ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు పాల్గొన్నారు.