CM Chandrababu: దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. ఈ భేటికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. వికసిత్ భారత్ – 2047, స్వర్ణాంధ్రపై నివేదికను సమర్పించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పలు కీలక అంశాలను ప్రజెంటేషన్ లో ప్రస్తావించారు. దీంతో ప్రధాని మోదీ సైతం చంద్రబాబు విజన్ కు ఫిదా అయినట్లు తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాల సీఎంలు కూడా చంద్రబాబు సూచించిన అంశాలను పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. ఇంతకీ సీఎం చంద్రబాబు తన ప్రజెంటేషన్ లో ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.
2.4 ట్రిలియన్ డాలర్లు లక్ష్యం
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ సీఎం చంద్రబాబు తన ప్రజెంటేషన్ ను ప్రారంభించారు. ఆ తర్వాత భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై ప్రశంసలు కురిపించారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజెంటేషన్లో వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
గ్లోబల్ సిటీగా విశాఖ
వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు నీతి అయోగ్ ప్రజెంటేషన్ లో చంద్రబాబు అన్నారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నగరానికి గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అయితే విశాఖ మోడల్ ను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహాయసహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.
డిజిటల్ గవర్నెన్స్కు ప్రాధాన్యం
అమరావతిలో క్వాంటం వ్యాలీకి చేసుకున్న ఒప్పందం గురించి కూడా నీతి అయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే కర్నూలులో నిర్మించతలపెట్టిన డ్రోన్ సిటీ ప్రణాళికలను సైతం సభ్యుల ముందు ఉంచారు. డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను ప్రభుత్వ వినియోగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు.
Also Read: Chamala Kiran Kumar: కవిత ఎఫెక్ట్.. నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్న కేటీఆర్.. ఎంపీ చామల
2029 నాటికి పేదరిక నిర్మూలన
అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న విఫ్లవాత్మక నిర్ణయాలను సైతం నీతి అయోగ్ ప్రజెంటేషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల నిబంధన రద్దు చేసినట్టు తెలిపారు. మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్టు చెప్పారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, రాష్ట్ర పురోగతిని కొలిచేందుకు 523 కీలక సూచికలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు అన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ పార్క్కు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ4 మోడల్ ను రాష్ట్రంలో తీసుకొచ్చినట్లు చంద్రబాబు వివరించారు.