అమరావతి, స్వేచ్ఛ: CM Chandrababu: సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని, పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ పరమైన సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లను దరిచేరనివ్వొద్దని స్పష్టం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలని అన్నారు.
9 నెలల్లోనే సంక్షేమానికి పెద్దపీట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు, పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని, అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలన్నారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదని సున్నితంగా హెచ్చరించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలని, పర్యటనల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలన్నారు.
also read: Pawan Kalyan: ఓటమికి బెదరను.. అదరను.. అసలు రహస్యం చెప్పేసిన పవన్ కళ్యాణ్
వైసీపీ నేతలకు దూరంగా ఉండాలి
ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని పార్టీ నాయకులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఈ విషయాన్ని చెప్తే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్లో నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని సూచనలు చేశారు.
‘‘సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడం మన విధానం. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలి. 2 కిలోవాట్ల రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనంగా అందిస్తాం. కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి బీసీలకు రూ.80 వేల మేర రాయితీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్టాప్ల ఏర్పాటే లక్ష్యం పెట్టుకోవాలి.
also read: Ambati Rambabu: పవన్ ప్లీజ్.. ఆ ఒక్క కోరిక తీర్చండి! అంబటి సంచలన వ్యాఖ్యలు
నామినేటెడ్ పోస్టులపై..
నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామన్న చంద్రబాబు, పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదువుల కోసం అందించాలని స్పష్టం చేశారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని, రాష్ట్రం వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమిస్తామని తెలిపారు. నామినేటెడ్ పదువుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయని, అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
పదువులు తీసుకున్నట్లు కాదు, ఎన్నికల్లో ప్రభావం చూపించాలన్నారు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దని, రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.