Swachh Andhra Swachh Diwas: మీ ఇంట్లో చెత్త పడవేస్తున్నారా.. అయితే మీరు చాలా నష్టపోయినట్లే. ఇది నిజం.. మీరు మీ ఇంట్లో చెత్తను అలా పడవేస్తే చాలు, మీ చేజేతులారా డబ్బులు వదులుకున్నట్లే. అసలేంటి చెత్త అన్నాక పడవేస్తారు. అయినా డబ్బులు వచ్చే అవకాశం ఇదెక్కడిది అనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
ఏపీలో స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రతి నెలా మూడో శనివారం జరిగే స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం సాగిస్తున్నారు. అయితే రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఈ సంధర్భంగానే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఈనెలలో థీమ్ – ఇ చెక్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వినూత్నంగా ప్లాన్ చేసింది.
ఇ- చెక్ అంటే అన్ని మున్సిపాల్టీలు,గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను పూర్తిగా సేకరించి రీయూజ్ చేయడం. దీనికోసం మున్సిపాల్టీల్లో ప్రత్యేకంగా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాల్టీల్లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సెంటర్లను ఇ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లుగా మార్చనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ సెంటర్లలో ఇ-వేస్ట్ ను సేకరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఇళ్లు, దుకాణాల్లో ఉన్న పాడైపోయిన మొబైల్ ఫోన్లు, టీవీలు,ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఇ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లలో ఇవ్వడం ద్వారా వారికి తగినంత నగదు కూడా చెల్లిస్తారు. దీనితో మహిళలకు కూడా ఉపాధి కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్పిపాల్టీల్లో మొత్తం 222 ఇ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. స్థానికంగా ఉండే మహిళా సంఘాల్లోని సభ్యులు కూడా ఇ-వేస్ట్ సేకరించేలా అవకాశం ఉంటుంది. ఇలా సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను రీయూజ్ చేసేందుకు ఉపయోగించేలా పలు కంపెనీలు ముందుకొస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
Also Read: Viral Video: గాల్లో ఎగురుతున్న డబ్బు.. ఏరుకుంటున్న జనాలు.. వీడియో వైరల్
ఈ కార్యక్రమం శనివారం ఒక్క రోజు మాత్రమే కాకుండా ఇ- వేస్ట్ తొలగింపునకు నిత్యం అందుబాటులో కలెక్షన్ సెంటర్లు ఉండేలా ఏర్పాట్లు చేసామన్నారు. శనివారం నుంచి జరిగే ఇ-వేస్ట్ కలెక్షన్ కోసం మున్సిపల్ కమిషనర్లు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని విజయవంతం చేయాలని మంత్రి నారాయణ సూచించారు. దీనిని బట్టి మన వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు విసిరి వేయకుండా ఇ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లకు తీసుకు వెళితే చాలు, మనకు తగిన నగదు కూడా అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీనితో కాస్త ఆర్థికంగా ప్రజలకు తోడ్పాటు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా భావించవచ్చు.