AP Assembly: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల భద్రతపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక సమావేశం నిర్వహించారు. సభ జరుగుతున్న సమయంలో లోపల, బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పీకర్ ఆదేశించారు. నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) పర్యటనపై అసెంబ్లీ ప్రాంగణంలో రిహార్సల్ జరగనుంది. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలుకు నిర్ణయించారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాసులు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుంది. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్లతో పాస్లు జారీ చేశారు. కాగా, అసెంబ్లీ ఒకటో గేటు నుంచి సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. గేటు 2 నుంచి మంత్రులకు, గేటు 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఉంది. ముఖ్యంగా మండలి ఛైర్మన్, స్పీకర్, సీఎం వచ్చి వెళ్లే కారిడార్లో ఇతరులకు అనుమతి లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 4వ గేటు నుంచి గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మంత్రులు, సభ్యుల పీఏలకు అవసరం మేరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతేకాదు శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ సిబ్బందికి అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ వచ్చినా ప్రాంగణంలోని బెల్ ఆఫ్ ఆర్మ్లో డిపాజిట్ చేయాలని అధికారులు సూచించారు.
అసెంబ్లీకి జగన్.. ఒక్కరోజే!
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నిర్ణయించుకున్నారు. అసెంబ్లీకి రావాలని ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి? సూపర్ సిక్స్పై ఎలాంటి ప్రశ్నలు సంధించాలి? విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలి? అనేదానిపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే సోమవారం ఒక్కరోజే గవర్నర్ ప్రసంగానికి హాజరై ఆ తర్వాత మంగళవారం నుంచి జగన్ గైర్హజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 25న కడపలో జగన్ పర్యటించనున్నారు. అయితే ఆ తర్వాత అయినా అసెంబ్లీకి వస్తారా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరుకాకపోతే సభ్యత్వం రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలని జగన్ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాలేదు.