Group -2 : ఏపీలో జరుగుతున్న గ్రూప్–2 మెయిన్స్ ఎగ్జామ్ లో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా నిముషం ఆలస్యంగా వచ్చినా సరే పరీక్ష( exam) రాసేందుకు అధికారులు అనుమతించరు. అయితే విజయవాడ నలంద విద్యానికేతన్ ఎగ్జామ్ సెంటర్ కు ఒక దివ్యాంగుడు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చాడు. దీంతో తన భర్త దివ్యాంగుడు కావడం వల్ల ఆలస్యం అయిందని.. లోపలికి అనుమతించాలని అతని భార్య అధికారులను వేడుకుంది.
దాంతో అధికారులు అతనిని లోపలికి అనుమతిచ్చాడు. అతను దివ్యాంగుడు కావడం వల్లే అనుమతించామని అధికారులు చెప్పారు. అధికారుల తీరుపై స్థానికంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక చాలా చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. కోవూరు మండలం గంగవరం పరీక్షా కేంద్రానికి ఒక అభ్యర్థి ఇలాగే ఆలస్యంగా రావడంతో అతన్ని అధికారులు వెనక్కు పంపించేశారు. దాంతో అతను ఏడ్చుకుంటూ వెనుదిరిగాడు. అటు బెజవాడ స్టెల్లా కాలేజీకి కూడా ఒక అభ్యర్థి ఆలస్యంగా వస్తే అధికారులు అనుమతించలేదు.