Thummala Nageswara Rao: బడ్జెట్ ప్రతిపాదనలు విజన్–2047 లక్ష్యాలను సాధించేలా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao )అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బడ్జెట్ ప్రతిపాదనలపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇన్పుట్ సరఫరా, విస్తరణ సేవలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సదుపాయాలు, డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలు, సహకార సంస్థల పనితీరు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.వ్యవసాయ రంగానికి సంబంధించి శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సమగ్రంగా, స్పష్టమైన లక్ష్యాలతో సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, ఆధునిక సాంకేతికతల అభివృద్ధి, కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా వినియోగించుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వృథా ఖర్చులకు ఆస్కారం లేకుండా, పథకాల అమలుకు నిజంగా అవసరమైన అంశాలను మాత్రమే గుర్తించి, ఖచ్చితమైన అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, వాస్తవ అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత అనుభవాలు, పథకాల ఫలితాలు, భవిష్యత్ అవసరాలపై స్పష్టతతో వివరాలు సమర్పించేలా ముందస్తు సిద్ధత ఉండాలన్నారు.రైతు కేంద్రంగా వ్యవసాయ విధానాలు రూపొందించడం, పథకాల అమలులో పారదర్శకత, ఫలితాలపై దృష్టి సారించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని, రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, వ్యవసాయ,ఉద్యాన వర్సిటీల వైస్ చాన్స్ లర్లు జానయ్య, రాజిరెడ్డి, తెలంగాణ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ కిరణ్ ,మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Also Readd: Hydra: రోడ్డు ఆక్రమణలను తొలగించిన హైడ్రా.. శబరి హిల్స్ లే ఔట్ యజమానులకు ఊరట!
వీడియోకాన్ఫరెన్స్
ఆరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం గత ఏడాది కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంగా కేంద్ర నిధులను వినియోగించుకోకపోవడంతో రైతులు నష్టపోయారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2025–26 సంవత్సరంలో కేంద్రం కేటాయించిన నిధులకు రాష్ట్ర వాటాను కూడా విడుదల చేసి మొత్తం నిధులను వినియోగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ దిశగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులకు అదనంగా మరో రూ.200 కోట్లు కేటాయించాలని కోరారు.పామాయిల్పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచినట్లైతే ఆయిల్ పామ్ ధర క్వింటాలుకు దాదాపు రూ.25 వేలకు తగ్గుకుండా ఉంటుందని, దీంతో పామాయిల్ రైతుల ఆర్థికాభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందించినట్లవుతుందన్నారు. పామాయిల్పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచే దిశగా కృషి చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల కోరారు.
Also Readd: Medchal News : బొమ్మరాసిపేటలో భారీ చోరీ.. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు!

