Bandi Sanjay Kumar: యువతకు భరోసా, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే వేదిక ఉద్యోగ మేళా
ఎన్ఐఎస్ఏలో ఉద్యోగ మేళా.. అతిథిగా హాజరై మాట్లాడిన బండి సంజయ్
మేడ్చల్, స్వేచ్ఛ: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భరోసా, ఆత్మవిశ్వాసాన్ని అందించే వేదికగా ఉద్యోగ మేళా నిలుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. హైదరాబాద్లోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (ఎన్ఐఎస్ఏ) శనివారం నిర్వహించిన 18వ ఉద్యోగ మేళా కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ సందర్భంగా అందజేశారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ యువత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపారమైన శ్రద్ధ, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన 17 ఉద్యోగ మేళాల ద్వారా దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు. 18వ ఉద్యోగ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 61,000 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
Read Also- Medaram Jatara 2026: మేడారం జాతర స్పెషల్.. 4,000 ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఉద్యోగ మేళా భరోసా, ఆత్మవిశ్వాసం, బలాన్ని ఇచ్చే వేదికగా మారిందని బండి సంజయ్ అన్నారు. ఇది యువత చదువులు, వృత్తిని అంకితభావంతో కొనసాగించేలా ప్రేరేపిస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ సకాలంలో నియామక ప్రక్రియలను చేపడుతోందని చెప్పారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా 11 లక్షలకు పైగా ఉద్యోగాలను అందించడం నియామక ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాతత, విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన అన్నారు.
కేవలం జీతం కోసమే కాకుండా దేశం, సమాజ సేవే లక్ష్యంగా పనిచేయాలని కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు మంత్రి పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ జాతీయ లక్ష్య సాధనలో కొత్త ఉద్యోగులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 18వ ఉద్యోగ మేళాను నిర్వహించి, మొత్తం 61,000 మందికి నియామక పత్రాలు అందజేసినట్టు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్ఐఎస్ఏలో 238 మంది అభ్యర్థులు నియామక పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఉద్దేశించి ప్రసంగించారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, వేగవంతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ డీపీ పరిహార్, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ దామోర్, తదితరులు పాల్గొన్నారు.
Read Also- Bhatti Vs Harish Rao: భట్టి గారూ… నేను సూటిగా అడుగుతున్నా.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

