GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజనపై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. బల్దియా విభజనపై వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీన ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. విభజన విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, కాంగ్రెస్ సర్కార్ పక్కా ప్రణాళికతో ఉందని స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో కలిసి అధికారులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేవలం పాలనాపరమైన అంశాలే కాకుండా, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపైనా మంత్రి పొన్నం చర్చించారు. ప్రతిష్టాత్మక హెచ్-సిటీ, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం సహా జీహెచ్ఎంసీ చేపట్టిన ఇతర ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. పనులు ఏ దశలో ఉన్నాయి? ఎక్కడెక్కడ జాప్యం జరుగుతున్నదనే విషయాలపై అదనపు కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
మెరుగైన సేవలు అందించే బాధ్యత మీదే..
హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా విభజించిన నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే బాధ్యత అధికారులదేనని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పాలకమండలి గడువు ముగిసిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత పూర్తిగా అధికారుల భుజస్కంధాలపైనే ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు లేని సమయంలో ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుందని, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు వంటి అంశాలపై ప్రశ్నించేవాళ్లు ఎక్కువ అవుతారని హెచ్చరించారు.
బాధ్యతతో పనిచేయాలి
జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపథ్యంలో మెరుగైన సేవలు అందించేందుకు జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న అధికారులంతా కేవలం ఉద్యోగ బాధ్యతగానే కాకుండా, సామాజిక బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read: Athreyapuram Brothers: కొత్త కథాంశంతో ప్రారంభమైన ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. నేటి తారానికి తగ్గట్టు
కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు
తెలంగాణకు కేంద్ర నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీద్దాం కలిసి రండి అని పిలిస్తే ప్రతిపక్ష నేతలెవరూ ముందుకు రావడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సింగరేణి సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీలు కలిసే తాము సేఫ్ జోన్లో ఉంటామని భావిస్తున్నాయని ఆరోపించారు.
ఎలాంటి విచారణకైనా సిద్ధం
సింగరేణి వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్షాలకు సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారని, తీరా ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతిస్తే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి వ్యూహాత్మకంగా సింగరేణి అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు సింగరేణిపై సీబీఐ ఎంక్వైరీ కావాలంటున్నారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు.
అదనపు కాంట్రాక్టులపై నిగ్గు తేలుద్దాం..
సింగరేణి అలాట్ మెంట్స్ వివరాలను తెప్పించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కిషన్ రెడ్డి, హరీశ్ రావులను పొన్నం డిమాండ్ చేశారు. 2014 నుంచి సింగరేణిలో ఇచ్చిన ఒకే ఒక్క కాంట్రాక్ట్ మినహా.. మిగతా కాంట్రాక్టులన్నీ ఎక్స్ట్రా (అదనంగా/నామినేషన్ పద్ధతిలో) గానే ఇచ్చారని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన సవాల్ స్వీకరించే దమ్ముందా అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న నాటకాలను కట్టిపెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడేందుకు కలిసి రావాలని హితవు పలికారు.
Also Read: Hydraa: శామీర్పేట్లో హైడ్రా కూల్చివేతలు.. ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణలు తొలగింపు

