Coal Block Allegations: బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలి
బల్క్ డీజిల్ కొనుగోలు పద్దతిని కాంట్రాక్టర్లకు బదిలీ ఎందుకు
ప్రజాధనం దుర్వినియోగం కాదా?
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సింగరేణి బొగ్గు కుంభకోణంపై (Coal Block Allegations) సీబీఐ (CBI) విచారణ వేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఆయన మంగళవారం లేఖ రాశారు. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, సింగరేణిలో టెండర్లలో పాల్గొనడానికి ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారని, ఈ విధానం సింగరేణి చరిత్రలో గతంలో లేదని, కోల్ ఇండియా లేదా వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ వంటి సంస్థలు కూడా దీనిని అనుసరించడం లేదని పేర్కొన్నారు.
Read Also- Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరలకు ( మైనస్ 7 శాతం% నుంచి మైనస్ 20 శాతం వరకు) ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానంలో అధిక ధరలకు (+7 శాతం నుంచి +10 శాతం వరకు) కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని, దీనివల్ల సింగరేణికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఐఓసీఎల్ నుంచి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే పద్ధతిని నిలిపివేసి, ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకు బదిలీ చేశారని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, అదనంగా జీఎస్టీ భారం పడుతోందని, ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా సింగరేణికి శాశ్వత సీఎండీ లేరని, కేవలం ఇన్ఛార్జ్ ఏర్పాటుతోనే నడుస్తోందని అన్నారు. ఈ నాయకత్వ శూన్యత వల్ల సంస్థలో మానిటరింగ్ బలహీనపడి, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా మౌనంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాలపై అంతర్గత లేదా రాష్ట్ర ప్రభుత్వ విచారణ సరిపోదని, కేవలం సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. 2024 తర్వాత తీసుకున్న టెండర్లు, పాలసీ నిర్ణయాలన్నింటిపై విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

