NIMS Hospital: పేద ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ ‘తులసి థెరప్యుటిక్స్’ సహకారంతో ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక వృక్షానికి విత్తనం ఎంత ముఖ్యమో, మానవ శరీరానికి స్టెమ్ సెల్స్ అంత ముఖ్యమన్నారు. దెబ్బతిన్న కణాలను, అవయవాలను తిరిగి రిపేర్ చేసే అద్భుత శక్తి ఈ కణాలకు ఉంటుందని వివరించారు. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా స్టెమ్ సెల్ థెరపీతో నయం చేయవచ్చని మంత్రి తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి జబ్బులతో బాధపడే వారికి ఈ చికిత్స ఒక సంజీవని లాంటిదన్నారు.
Also Read: Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్
పేదలకు భారం తగ్గించడమే లక్ష్యం
శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని మళ్ళీ కొత్తగా సృష్టించేందుకు ఈ చికిత్స దోహదపడుతుందని పేర్కొన్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలు చెబుతూ స్టెమ్ సెల్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుతం స్టెమ్ సెల్ చికిత్స కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లోనే అందుబాటులో ఉందని, అది కూడా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదని మంత్రి గుర్తు చేశారు. సామాన్య ప్రజలకు ఆ భారం లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఈ అత్యాధునిక చికిత్సను నిమ్స్లో అందించాలన్నదే తమ సంకల్పమన్నారు. ఈ ల్యాబ్లో తులసి థెరప్యుటిక్స్ మరియు నిమ్స్ డాక్టర్లు కలిసి లోతైన పరిశోధనలు చేస్తారని, త్వరలోనే ఈ పరిశోధన ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Drinking Water: జలమండలి ప్రత్యేక వ్యూహం.. రేపటికోసం కాస్త ముందుగానే కళ్లు తెరిచిన వాటర్ బోర్డ్!

