Jagtial District: చైనా మాంజా వినియోగం వద్దని పోలీసులు, అధికారులు ఎంతగా హెచ్చరించినప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. యథేచ్చగా వాటిని విక్రయిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో చైనా మాంజా తగిలి నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాంజా దెబ్బకు మెడ కోసుకు పోవడంతో ఏకంగా 20 కుట్లు పడ్డాయి.
నిజామాబాద్ కు చెందిన శ్రీహాన్ (4) అనే బాలుడు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు మెట్ పల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. పట్టణంలోని దుబ్బవాడలో గల ఇంటి ముందు శ్రీహాన్ ఆడుకుంటుండగా బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. చైనా మాంజా పట్టుకొని వేరే చిన్నారి పరిగెడుతుండగా అది ప్రమాదవశాత్తు బాలుడి మెడకు తగిలింది.
Also Read: Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల వివాదం.. టీటీడీ ఛైర్మన్పై భూమన సంచలన ఆరోపణలు
తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన శ్రీహాన్ ను తీసుకొని కుటుంబ సభ్యులు హుటాహుటీనా నిజామాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలుడికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు.. మెడ చుట్టూ ఏకంగా 20 కుట్లు వేశారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చైనా మాంజాను వెంటనే బ్యాన్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దేవుడి దయతో తమ బిడ్డ ఎలాంటి ప్రాణపాయం లేకుండా బయటపడ్డాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

