CM Revanth Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం డి పి ఆర్ మొదలుకొని, జారీ చేసిన జీవోలు, ప్రాజెక్టు సోర్సు మార్పు తదితర అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని.. జనవరి ఒకటో తేదీలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు. ఆదివారం సీఎం నివాసంలో ఇరిగేషన్ అధికారులు, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో కలిసి కృష్ణ జలాల్లో వాటా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన అంశాలు.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు.. ఏపీతో నీటి పంచాయతీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం, ఆ తర్వాత ఇచ్చిన రివైజ్డ్ ఎస్టిమేట్స్, రిజర్వాయర్లు, పంపుల నిర్మాణం, కాల్వలు డిస్ట్రిబ్యూటరీల తవ్వకం, పరిహారం చెల్లింపులు, భూసేకరణ సహా అన్ని వివరాలు సమగ్రంగా, అందుకు సంబంధించిన జీవోలు, డాక్యుమెంట్స్ ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ప్రాజెక్టుకు 45 టీఎంసీలు చాలంటూ..
ప్రాజెక్టు డీపీఆర్పై నిపుణుల కమిటీ చేసిన స్టడీ రిపోర్టులు, ఆ కమిటీ చెప్పిన అంశాలను నివేదిక రూపంలో తయారు చేసి ఇవ్వాలని అన్నారు. ప్రాజెక్టు డీపీఆర్ వాస్తవంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వెనక్కు వచ్చిందని అప్పుడు కెసిఆర్ స్పందించలేదని.. డి పి ఆర్ వెనక్కి వచ్చిన కాపీని సైతం ఇవ్వాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీలు చాలంటూ ఎక్కడా లేఖలో రాయలేదని, ఫస్ట్ ఫేజ్లో మైనర్ ఇరిగేషన్లో వాడుకోని 45 టీఎంసీలను వాడుకుంటామని, గోదావరి డైవర్షన్లో వచ్చే మరో 45 టీఎంసీలను ట్రిబ్యునల్ అవార్డు అయిపోయాక రెండో ఫేజ్లో వాడుకుంటామని లేఖలో స్పష్టంగా రాశామని సీఎం పేర్కొన్నారు. బీఆర్ఎస్ వాళ్లు 45 టీఎంసీలకే లెటర్ రాశారని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని మనం ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని అధికారులను ప్రశ్నించారు.
Also Read: Instagram: యూఎస్లో ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్..
కృష్ణ, గోదావరి నుంచి తెలంగాణకు రావలసిన వాటా పై ఆది నుంచి కొట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నట్టు నాటి పాలకులు సంతకాలు చేసిన లేఖలు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ తదితర రికార్డులను తీసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. కృష్ణా జలాలపై కేసీఆర్ చేసిన తప్పులన్నింటినీ అసెంబ్లీలో బయటపెట్టేలా, బీఆర్ఎస్ను ఇరుకునపెట్టే ఆధారాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెట్టాలని అధికారులకు సూచించారు. చిన్న తప్పుకు కూడా తావివ్వొద్దని అధికారులను ఆదేశించారు.
జూరాల ప్రాజెక్టు నుంచి..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును ఎందుకు మార్చారని, దానికి దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. జూరాల నుంచి ప్రతిపాదించిన ప్రాజెక్టును అసలు శ్రీశైలానికి ఎందుకు మార్చాల్సి వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపడితే అది తెలంగాణ భూభాగంలోనే ఉండేదన్నారు. అడ్డంకులు, ఇంటర్స్టేట్ లొల్లి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేసుకునేవాళ్లమని, నీళ్లను వాడుకునేవాళ్లమని పేర్కొన్నారు. జూరాల నుంచే శ్రీశైలానికి వరద ప్రవాహం వెళ్తుందని, అలాంటప్పుడు అవే వరద జలాలను జూరాల వద్దే వాడుకుంటే మేలు జరిగేది అన్నారు. వర్షాకాలంలో వచ్చే వరద కు రోజూ 3 టీఎంసీల చొప్పున 25 రోజుల పాటు లిఫ్ట్ చేసుకున్నా 75 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకుని ఆయకట్టుకు నీళ్లందించేవాళ్లమని తెలిపారు.
Also Read: Aadi Saikumar: ‘శంబాల’ సక్సెస్ జోష్.. హిట్ బ్యానర్లో ఆదికి బంపరాఫర్!

