Nara Bhuvaneshwari: గండిపేట ప్రాంగణానికి రాగానే పాత స్మృతులు.. అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని గండిపేటలో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కాలినడకన తిరుగుతూ ఎన్టీఆర్ స్కూల్ ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ సంస్థకు చెందిన విద్యార్థులు గాడ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం చంద్రబాబు దంపతులు ఆసక్తిగా తిలకించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఎన్టీఆర్ విద్యా సంస్థలు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…”గండిపేటకు వస్తే పాత విషయాలు గుర్తుకు వస్తాయి. గండిపేట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉండేది. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా గండిపేట ఉండేది.. ఇప్పుడు విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. గండిపేటలో భావితరాల కోసం నాయకత్వాన్ని తయారు చేశాం. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న తరగతుల్లోనే నాడు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించాం. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించాం. చిన్న మొక్కగా ప్రారంభించిన విద్యా సంస్థలను పెద్ద వృక్షంగా మార్చారు. ఎన్టీఆర్ ట్రస్టు, విద్యా సంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు గ్రూప్-1 పరీక్షల్లో నలుగురు పాస్ అయ్యారు, ముగ్గురు జూనియర్ సివిల్ జడ్డీలుగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన వారికి దేశంలోని వివిధ ప్రముఖ విద్యా సంస్థల్లో 29 మందికి సీట్లు వచ్చాయి. 131 మంది విద్యార్థులతో విద్యా సంస్థను ప్రారంభించాం… ఇప్పుడు 1641 మంది చదువుతున్నారు. సంస్థ ఈ స్థాయికి ఎదగడానికి నారా భువనేశ్వరినే కారణం.”అని ముఖ్యమంత్రి అన్నారు.
Also Read: Shambala Movie: హిందీ డబ్బింగ్కు సిద్ధమవుతున్న ఆది ‘శంబాల’.. అక్కడ రిలీజ్ ఎప్పుడంటే?
చదువు ముఖ్యం… విలువలు మరింత ముఖ్యం
“SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చాయి. నల్సార్, ఎన్.ఎల్.యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు. సమాజంలో సమానత్వం కోసం పరితపించే వ్యక్తి ఎన్టీఆర్. ట్రస్ట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పించే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమే. మన సంస్కృతి-సంప్రదాయాలను మరిచిపోవద్దు. ఆధునాతన విధానాల్ని అందిపుచ్చుకోవాలి… విలువలను కాపాడుకోవాలి. విద్యార్థులందరూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి… టెక్నలాజీని అందిపుచ్చుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎడిషనల్ కోర్సులు చేయండి. నిరంతరం నేర్చుకునే అంశంపై ఫోకస్ పెట్టండి. విద్యతో పేదరికాన్ని జయించవచ్చు… అప్పుడు సంపద తనంతట వస్తుంది. ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నాం. దేశం మెచ్చే విధంగా విద్యా సంస్థలను రన్ చేయాలి. విద్యార్థులు చక్కగా చదువుకుని సమాజంలో గుర్తింపు దక్కించుకోవాలి… ఎన్టీఆర్ విద్యా సంస్థలకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల మందికి రక్తదానం చేశారు. 273 మంది తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్త మార్పిడి చేశారు. సంజీవని క్లినిక్ ల ద్వారా 22 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించారు. ప్రకృతి విపత్తుల్లో బాధితులను ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నారు. ట్రస్ట్ ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నారు.”అని సీఎం అన్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితో సేవలందిస్తున్నాం: భువనేశ్వరి
ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ…”విద్యార్థుల ఆశలకు అనుగుణంగా వారి భవిష్యత్తును రూపుదిద్దుతున్నాం. మానవ సేవే మాధవ సేవ అని ఎన్టీఆర్ నమ్మారు.. దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి హెల్త్ కేర్ సర్వీసులు, తలసేమియా సెంటర్, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్కులు పని చేస్తున్నాయి. పేద, అనాధ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. సివిల్ సర్వీసెస్ అకాడెమీ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు… ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నాం. స్త్రీశక్తి ద్వారా పేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నాం అన్నారు.
Also Read: Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?

