KTR: సీఎం రేవంత్ ఎవరితో ఫుట్ బాల్ ఆడతాదో తనకు తెలియదు కానీ, తాను మాత్రం అతడ్ని ఫుట్ బాల్ ఆడుకుంటాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఇంట్లో వారి గురించి తాను మాట్లాడనన్న కేటీఆర్.. కుటుంబ సభ్యుల విషయాల్లో ఆయనలాగా చిల్లర రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందన్ని కేటీఆర్.. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని స్పష్టం చేశారు.
సీఎంకు కేటీఆర్ సవాల్..
బహిరంగ సభలపై ఆదివారం నిర్వహించే సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ అన్నారు. అన్ని విషయాలపై దిశానిర్దేశం చేస్తారని, లోకల్ బాడీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ ఉంటుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి.. బీఆర్ఎస్ లోనే ఉన్నామనటం పెద్ద కామెడీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ చెప్తున్నట్లు గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66 శాతం విజయం నిజమైతే.. పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్ కు రావాలని కేటీఆర్ సవాల్ చేశారు.
అసలైన ఐరన్ లెగ్స్.. రేవంత్, రాహుల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఫెయిల్ కాదని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకనే 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీలు గెలిచామని అన్నారు. రేవంత్ సీఎం అయ్యాక సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదన్నారు. తాను ఐరన్ లెగ్ కాదని.. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే అసలైన ఐరన్ లెగ్ లు కేటీఆర్ అని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని అంచనా వేశారు. మరోవైపు గ్రేటర్ లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదన్న కేటీఆర్.. గ్రేటర్ ను మూడు కార్పోరేషన్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు.
ఆ మాట చెప్పడానికి.. రేవంత్ ఎవరు?
గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డికే స్పష్టత లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక అన్నారు. రేవంత్ రెడ్డి దెబ్బకు పరిశ్రమలు ఆంధ్రకు వెళ్ళిపోతున్నాయని విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు వెళ్ళిపోయిందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు . టైం కోసం ఎదురుచూస్తున్నారు చెప్పుకొచ్చారు. తమను 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30శాతం సీట్లు బీసీలకు ఇచ్చామని పేర్కొననారు. సీఎం రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.
Also Read: SHE Teams: షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు.. హిజ్రాల గుట్టురట్టు.. 66 మంది అరెస్ట్
బీజేపీ నేతలతో రేవంత్కు సత్సంబంధాలు
యూపీ మాజీ సీఎం అఖిలేష్ తమ పాత దోస్త్ అని అతడితో ఫ్రెండ్లీగా ఉంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీకి మాత్రమే లోపాయికారి ఒప్పందం ఉందని మరోసారి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని ప్రధాని, హోంమంత్రి స్వయంగా అన్నారన్నారు. దిల్లీలో బీజేపీ ఎంపీ దుబే గృహప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లారో రామచంద్రరావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రేవంత్.. విందులు, వినోదాలు ఎవరి ఇళ్లల్లో జరుగుతున్నాయో తెలుసని పేర్కొన్నారు. దిల్లీ తుగ్లక్ రోడ్ లోని రేవంత్ రెడ్డి ఇంటిని రీమోడల్ చేయించిందే బీజేపీ ఎంపీ అని మండిపడ్డారు. సీఎం రమేష్ కు కాంట్రాక్ట్ లు ఇస్తుందే రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.

