CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. వీటి ద్వారా 4 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు.
రూ.30 వేల కోట్లు వ్యయం
YIIRSల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా విద్యారంగంలో విఫ్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న సీఎం రేవంత్.. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు (YIIRS) ఏర్పాటుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఒక్కోదానికి రూ.200 కోట్ల చొప్పున ఖర్చు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కేంద్ర విద్యా శాఖ మంత్రితో..
మరోవైపు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటి అయ్యారు. హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
9 కేంద్ర విద్యాయాలకు విజ్ఞప్తి
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: West Bengal Voter’s: బెంగాల్లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు
సోనియాతో సీఎం భేటి..
అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సోనియా గాంధీకి అందజేశారు. తెలంగాణలో డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను సోనియా గాంధీకి వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా గాంధీకి తెలియజేశారు. కాగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిని ఈ సందర్భంగా సోనియా గాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

