తిరుమల బ్యూరో, స్వేచ్ఛ: వైకుంఠ ఏకాదశి టోకెన్ల సందర్భంగా జరిగిన తొక్కిసలాట, టీటీడీ (TTD) చరిత్రలో చెరిగిపోని మచ్చగా మిగిలిపోయింది. అనుకోకుండా జరిగిందని ప్రకటించినా, భవిష్యత్ కార్యక్రమాలపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో తర్వాతి కార్యక్రమాలపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రథసప్తమి వేడుకలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు పడుతోంది. శుక్రవారం పనులను పరిశీలించిన ఈవో శ్యామలరావు సకాలంలో ఏర్పాట్లు పూర్తయ్యేలా చూసుకుంటున్నారు. రథసప్తమి రోజున జనం పోటెత్తే అవకాశం ఉండడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
సకాలంలో ఏర్పాట్లు పూర్తి
ఫిబ్రవరి 4న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమి జరగనుంది. ఈ ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులు గ్యాలరీలలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ, నిఘా, భద్రత, శ్రీవారి సేవకులు, పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, ఇంజనీరింగ్ పనులు తదితర అంశాలపై శాఖలవారీగా ఈవో సమీక్షించారు.
రథసప్తమికి TTD సూచనలు
- రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు
- అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేశారు
- ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేశారు
- తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు
- బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు
- ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలి
వాహన సేవల వివరాలు
రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. ప్రతి సంవత్సరం శుక్ల పక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు.
- ఉ.5.30 గంటల నుంచి ఉ.8 గంటల వరకు సూర్య ప్రభ వాహనం
- ఉ.9 గంటల నుంచి ఉ.10 గంటల వరకు చిన్న శేష వాహనం
- ఉ.11 గంటల నుంచి మ.12 గంటల వరకు గరుడ వాహనం
- మ.ఒంటిగంట నుండి మ.2 గంటల వరకు హనుమంత వాహనం
- మ.2 గంటల నుండి మ.3 గంటల వరకు చక్రస్నానం
- సా.4 గంటల నుండి సా.5 గంటల వరకు కల్పవృక్ష వాహనం
- సా.6 గంటల నుంచి రా.7 గంటల వరకు సర్వభూపాల వాహనం
- రా.8 గంటల నుంచి రా.9 గంటల వరకు చంద్రప్రభ వాహనం