Etela Rajender: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వర్గంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల వెల్లడైన తొలి దఫా సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై బండి వర్గీయులు వాట్సాప్ ద్వారా చేసిన ప్రచారంపై ఆయన స్పందించారు. కమలాపూర్లో తన నివాసంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నానని, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేనంటూ చురకలంటించారు. అవగాహన లేని పిచ్చోళ్లు అలాంటి పోస్టులు పెడతారంటూ విమర్శించారు.
ప్రజలన్నీ గమనిస్తున్నారు
రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, ఆ పోస్టుల గురించి సమయం వచ్చినప్పుడు పార్టీనే తేలుస్తుందని స్పష్టం చేశారు. ఎవరేం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతున్నదని, వారి సంగతి వారే తేలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తొలి దఫా సర్పంచ్ ఫలితాల్లో ఈటల రాజేందర్ బలపర్చిన అభ్యర్థిపై సంజయ్ బలపర్చిన అభ్యర్థి గెలిచారని ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రకటన విడుదల చేయడం వివాదానికి కారణమైంది.
Also Read: Akhilesh Yadav: ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తాం: అఖిలేష్ యాదవ్

