Disaster Management: గ్రేటర్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని, భౌగోళికంగానూ నగరం విస్తరిస్తున్నందున విపత్తు నిర్వహణ విభాగం పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవెలప్మెంట్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించాలని, అందుకు తగిన మార్పులు చేయాలని, ఇకపై ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు పెట్టాలని సీఎం సూచనప్రాయంగా నిర్ణయించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా పునర్వవస్థీకరణ జరగాలని ఆదేశించారు. నగరంలో ప్రజలు ఎదుర్కునే సమస్యలన్నింటిలో హైడ్రా క్రియాశీలంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
దాదాపు రెండు వేల కిలోమీటర్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించటంలో, సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని సీఎం నిర్ణయించారు. హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగు నీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందించాలని సూచించారు. అందుకు అనుగుణంగా విభాగం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు.
సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామిమా అబ్జర్వేరటరీ, గుడిమల్కాపూర్ కోనేరు లాంటి వివిధ చారిత్రక ప్రదేశాలపై జీహెచ్ఎంసీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను ప్రదర్శించింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి, అందులోనే జోడించాలని సీఎం తెలిపారు.