– సీఎం ఢిల్లీ పర్యటన వెనుక లక్ష్యం ఇదే
– రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బీఎం నుంచి తప్పించుకునే ప్రయత్నం
– జేబులు నింపుకోవడానికి త్వరలో కొత్త చట్టాలు
– రాష్ట్ర ప్రభుత్వంపై బీజేఎల్పీ ఏలేటి విమర్శలు
CM Revanth Reddy: హైదరాబాద్లోని ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశారని, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రైతు రుణమాఫీ కోసం రేవంత్ రెడ్డి అనేక మార్గాలు వెతుకుతున్నారని చెబుతూ.. రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఈ నెల నుంచి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునేలా ఆర్బీఐ ఇంటర్నల్ క్రెడిట్ డిపార్ట్మెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ అడిగారని తెలిపారు.
గతంలో పీసీసీగా ఉన్నప్పుడు కోకాపేట్లో 4 వేల కోట్ల భూముల వేలంపై రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టారని ఏలేటి అన్నారు. కానీ, ఆయనే సీఎం అయ్యాక రూ. 30 వేల కోట్ల ప్రభుత్వ భూముల అమ్మకాలకు సిద్ధమయ్యారని ఆరోపించారు. భావి తరాల ఆస్తులను కూడా ముందే అమ్ముకోవడానికి రెడీ అవుతున్నదన్నారు. భవిష్యత్లోపార్కులకు కూడా ప్లేస్ ఉండదని చెప్పారు. మెహెదీపట్నంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపి ఒక ప్రజాప్రతినిధి తాలూకు వ్యక్తి 120 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు చేశారు.
అధికార పార్టీ జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రెండు భయంకరమైన చట్టాలను తీసుకురానుందని జోస్యం చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాలను ప్రవేశపెట్టవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉన్నదని కామెంట్ చేశారు. తాము ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే.. రేవంత్ రెడ్డికి ఎందుకంత భయం.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.
వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లను ప్రోత్సహిస్తున్నదని, రేవంత్ రెడ్డి మొన్న వరంగల్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని ఏలేటి గుర్తు చేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద మీడియా ఆంక్షలు విధించడం ప్రజా పాలనా? అని ప్రశ్నిస్తూ.. నిరుద్యోగ యువతపై కనికరం లేకుండా లాఠీ చార్జ్ చేయించడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పటికల్లా భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేేరికపైనా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇస్తున్నామని చెప్పారు. అలాగే.. మిగిలిన పార్టీ మారిన ఎమ్మెల్యేలపైనా ఫిర్యాదు చేస్తామని వివరించారు. దానం నాగేందర్ ఒక పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిస్తే.. మరో పార్టీ టికెట్ పై ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారని విమర్శించారు.