Gram Panchayat Election 2025: నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామపంచాయతీలోని ఎన్ ఎస్పీ క్యాంప్ ఓటర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారట్లేదని, 15 ఏళ్లుగా సీసీ రోడ్డుకు సైతం నోచుకోలేదని ఆరోపిస్తూ సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక బ్యానర్ ను సైతం విడుదల చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వేములపల్లి గ్రామపంచాయతీ ప్రస్తుతం ఎస్సీ జనరల్ కు రిజర్వు అయ్యింది. ఇక్కడ 3602 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ జీపీ పరిధిలోని 11వ వార్డు జనరల్ కు రిజర్వు కాగా.. 12 వ వార్డును బీసీ మహిళకు కేటాయించారు. ఎన్ ఎస్పీ క్యాంపుగా పిలవబడే ఈ కాలనీలో మొత్తం 600 మంది ఓటర్లు ఉన్నారు. కాగా గడచిన పదిహేను ఏళ్లుగా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టని కారణంగా ఇక్కడి ఎన్ ఎస్పీ క్యాంప్ ప్రజలతో పాటు ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే ఏడు గ్రామాల ప్రజలు ప్రమాదానికి గురైతున్నట్లు కాలనీ ప్రజలు చెప్పారు. ఇప్పటికే పదిమంది దుర్మరణం చెందారని వాపోయారు. అద్దంకి – నార్కెట్ పల్లి హైవే నుంచి సర్వీస్ రోడ్డు వేయకపోతే ఓట్లు అడిగేందుకు రావద్దని ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులను కోరుతున్నారు.
Also Read: Delhi Hospital: ఆస్పత్రిలో అమానుషం.. చనిపోయిన పేషెంట్ నగలు మాయం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మరోవైపు తెలంగాణలోని మూడు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాకు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో ఈ మూడు గ్రామపంచాయతీలు ఉన్నాయి. తొలి విడత నామినేషన్స్ సందర్భంగా నెల్కి వెంకటాపూర్, వందూర్ గూడ, గూడెం గ్రామాల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. తమ డిమాండ్లను పరిష్కరించకపోవడమే ఇందుకు కారణమని గ్రామస్థులు స్పష్టం చేశారు.
