– అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు
– కొలువుల జాతర కొనసాగుతుంది
– కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి
Sama Rammohan Reddy: కాంగ్రెస్ పాలనలో కొలువుల జాతర కొనసాగుతుందని, దీనికితోడు జాబ్ క్యాలెండర్ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు భరోసాగా నిలబడిందని తెలిపారు. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా.. పెండింగ్లో ఉన్న పలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తున్నదని వివరించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించిందని ట్విట్టర్ వేదికగా ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలు, రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసులు నిరుద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయని సామా రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. దాదాపు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్న గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రెండు సార్లు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణను కట్టుదిట్టం చేసిందని, గత పాలకవర్గాన్ని తప్పించి కొత్త ఛైర్మన్ ను, బోర్డు సభ్యులను నియమించిందని వివరించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ ఛైర్మన్ను కలిసి జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.
గత ప్రభుత్వ హయంలో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో ప్రధాన అడ్డంకిగా మారిన కోర్టు కేసుల చిక్కుముడులన్నింటినీ ఒక్కటొక్కటిగా కొత్త ప్రభుత్వం అధిగమించిందని సామా రామ్మోహన్ రెడ్డి వివరించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మొత్తం 28,942 మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించిందని గుర్తు చేశారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా మొత్తం 28,942 పోస్టులను కొత్త ప్రభుత్వం భర్తీ చేసిందని తెలిపారు. వీటిలో 15,371 పోస్టులకు పురుషులు ఎంపికయ్యారని, మిగతా 13,571 పోస్టులను మహిళలు సాధించారని పేర్కొన్నారు. మొత్తం నియామకాల్లో 53 శాతం ఉద్యోగాలకు పురుషులు ఎంపికైతే.. 47 శాతం ఉద్యోగాలను మహిళలు దక్కించుకున్నారు.
నియామకాల్లో అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలోనూ కోర్టు తీర్పులకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించిందని, గతంలో రెండుసార్లు రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించిందని, అందుకు సంబంధించి టీజీపీఎస్సీ రేపో ఎల్లుండో ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోందని సామా రామ్మోహన్ రెడ్డి వివరించారు. గ్రూప్ 2 పరీక్షలను షెడ్యూలు ప్రకారం ఆగస్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలతో 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయని, అప్పుడు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఒక్కటి కూడా వెల్లడి కాలేదని గుర్తు చేశారు. 581 వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయని, ఎన్నడూలేని విధంగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించిందని, టెట్ 2024ను ప్రశాంతంగా నిర్వహించిందని వివరించారు.