– ప్రైవేటు హాస్పిట్ ప్రారంభోత్సవంలో గంటకుపైగా సమయం
– మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంట్రాక్టర్లను బెదిరించడానికి వచ్చారా?
– సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తన వరంగల్ పర్యటనలో శనివారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి.. కాకతీయ టెక్స్టైల్ పార్క్ను పరిశీలించారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులతో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పర్యటన రోజంతా ఆయన బిజీబిజీగా గడిపారు. బీఆర్ఎస్ నాయకులు ఆయన పర్యటనపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ఇలా వచ్చి.. అలా వెళ్లినట్టు ఉన్నదని విమర్శలు చేస్తున్నారు. ఎంజీఎం ముందు నుంచే వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ హాస్పిటల్ను విజిట్ చేయకపోవడం దారుణం అంటూ ఎత్తి చూపుతున్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ అభివృద్ధిపై శ్రద్ధతో సీఎం రేవంత్ రెడ్డి నగర పర్యటన చేయలేదని, ఓ ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్ కోసమే వచ్చారని ఆరోపించారు. పేదల కోసం కట్టిన హాస్పిటల్ పై శ్రద్ధ లేదని, ఎంజీఎం హాస్పిటల్ సందర్శించకపోవడమే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గంటకుపైగా సమయం కేటాయించిన సీఎం రేవంత్ ఎంజీఎంను సందర్శించలేదని విమర్శించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాంట్రాక్టర్లను బెదిరించడం కోసమే ఆయన వచ్చినట్టు ఉన్నదని మరో ఆరోపణ చేశారు. గత ప్రభుత్వంలో చేసిన పనిలో వంకలు పెట్టడమే రేవంత్ లక్ష్యంగా ఉన్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. తాము గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటామని, ప్రశ్నిస్తామన్నారు.
రేవంత్ రెడ్డిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని, 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కేవలం 26 మంది మాత్రమే ఆయనకు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇతర మంత్రులపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తన వర్గాన్ని పెంచుకోవడానికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలన పట్టు తప్పిందని ఫైర్ అయ్యారు.