– కాంగ్రెస్లో చేరిక ఖాయమేనని వార్తలు
– కుమారుడి భవిష్యత్తు కోసమే
– పూర్తయిన చర్చలు, చేరిక లాంఛనమే
BRS Party: తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతున్న వేళ.. పార్టీలో సీనియర్ సభ్యురాలిగా ఉన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్బై చెప్పనున్నారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్బై చెప్పగా, తాజాగా అదే బాటలో చేవెళ్ల ఎమ్మెల్యే కూడా సాగనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆషాడ మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల మహేశ్వరం నియోజక వర్గంలో పర్యటిస్తున్న వేళ.. ఆమె మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హోం, విద్యాశాఖలను మీ కోసమే ఖాళీగా ఉంచారేమో మేడమ్’ అంటూ మీడియా ప్రశ్నించగా.. ‘మంత్రి కావాలంటే అదృష్టమూ ఉండాలి’ అంటూ సరదాగా ఆమె బదులిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆమె సీఎం రేవంత్ రెడ్డి మీద కనీసం పార్లమెంటు ఎన్నికల వేళ కూడా ఘాటుగా విమర్శలు చేయలేదు. పైగా, ఆమె తన కుమారుడు కార్తీక్ రెడ్డి రాజకీయ భవితవ్యం కోసమే, అతనితో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, అతనికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశమూ ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం, పట్లోళ్ల కుటుంబాలలో ఎవరో ఒకరు అధికార పక్షంలో ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2019 నాటి నుంచి ఇది మారి రెండు కుటుంబాలూ అధికార పక్షంలో ఉంటూ వచ్చాయి. గతంలో పట్నం మహేందర్రెడ్డి, పట్లోళ్ల సబిత ఈ ఇద్దరూ బీఆర్ఎస్లో ఉండగా, ఇటీవల పట్నం మహేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరగా, తాజాగా సబితమ్మ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.