– జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి ఓకే
– ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
– తెలంగాణతోపాటు 8 రాష్ట్రాల్లో భూముల అప్పగింత
Union Govt: తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. కంటోన్మెంట్ పరిధిలోని ప్రాంతాలను రాష్ట్రాలకు అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కంటోన్మెంట్ భూములను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఓకే చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అన్ని ప్రాంతాలు జీహెచ్ఎంసీలోకి రానున్నాయి. ఇక వాటి అభివృద్ధి కూడా జీహెచ్ఎంసీ చేతిలోనే ఉండనున్నాయి. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. 28వ తేదీన ఆదేశాలు వచ్చాయి. తాజాగా కేంద్రం జీవోను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన భేటీలో తెలంగాణ నుంచి సీఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ పాల్గొన్నారు.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని భూములు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. అలాగే.. కంటోన్మెంట్ బోర్డు అప్పులనూ జీహెచ్ఎంసీ తీర్చనుంది. ఇందుకు జీహెచ్ఎంసీ అంగీకరించింది కూడా. ఇక బోర్డు పరిధిలోని అన్ని ఆస్తులను ఉచితంగా రాష్ట్ర రక్షణ శాఖకు కేంద్రం అప్పగించనుంది.
సీఎం రేవంత్ రెడ్డి తన ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలోనూ తొలి రోజే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయినప్పుడూ రక్షణ భూముల గురించి మాట్లాడారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సుమారు 2,500 ఎకరాల రక్షణ భూములను రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ భూములు అవసరం పడుతున్నాయని చెప్పారు. ఇందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వానికి వేరే చోట భూములు ఇచ్చామని పేర్కొన్నారు. ఇందుకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ భూములను రాష్ట్రానికి అప్పగిస్తూ నిర్ణయాలు జరగడం గమనార్హం.