Talasani Srinivas Yadav: ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. దగా ప్రభుత్వం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు రాజకీయం, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. రెండేళ్లు అవుతున్నా అమలు చేయకుండా బీసీలకు తీరని మోసం, దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్దితో లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన కూడా పారదర్శకంగా జరగలేదని అసెంబ్లీలో ప్రభుత్వం అంగీకరించినది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సమాజంలో 50 శాతంకు పైగా ఉన్న బీసీలకు సర్పంచ్ ఎన్నికలలో 17.08 శాతం కేటాయించి అవమానిస్తారా? అని నిలదీశారు.
Also Read: CM Revanth Reddy: ఏరోస్పేస్, ఏవియేషన్ హబ్గా హైదరాబాద్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు దమ్ముంటే పార్టీ పరంగా ఇస్తామన్న 60 శాతం రిజర్వేషన్ తో జాబితాను వారం రోజులలో ప్రకటించాలని సవాల్ చేశారు. బీసీలను నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడతామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా బీసీలు జిల్లాలలో మంత్రులు, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తరహాలో మరో ఉద్యమం చేపడతామని, కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు వదలబోమని హెచ్చరించారు.

