Konda Surekha: టెక్నాలజీని ఉపయోగించి వన్యప్రాణులను సంరక్షించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. వన్యప్రాణి భద్రతా టీంను అభినందించారు. సచివాలయంలో దేశంలోనే మొదటిసారి టైగర్ ప్రొటెక్షన్ సెల్ను ఆమె ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ నెల 28న ఐసీసీసీలో జరుగబోయే తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అటవీ, జూ శాఖల అధికారులు, సిబ్బంది వన్యప్రాణి రక్షణ కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. వన్యప్రాణుల భద్రతకు, ప్రజల రక్షణకు కొత్తగా హైటెక్ టైగర్ మానిటరింగ్ సెల్, కమాండ్ హబ్ ఏర్పాటైందని వివరించారు. దీంతో పులుల సంచారం, టైగర్ రిజర్వులను తక్షణమే పర్యవేక్షించవచ్చని తెలిపారు.
24 గంటలు పర్యవేక్షించేందుకు సీసీటీవీలు
హైదరాబాద్లోని స్టేట్ కమాండ్ సెంటర్కు, మన్ననూరు (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్), మంచిర్యాల (కవల్ టైగర్ రిజర్వ్)లోని కొత్త రీజినల్ సెంటర్లు జత చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. పులుల కదలికలను 24 గంటలు పర్యవేక్షించేందుకు సీసీటీవీలు, కెమెరా ట్రాప్స్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నామన్నారు. వేటగాళ్ల ప్రవేశం లేదా అక్రమ కార్యకలాపాలను వెంటనే గుర్తించి అడ్డుకోవచ్చని వివరించారు. అటవీ ప్రాంతాల పక్కన నివసించే ప్రజల రక్షణ కూడా ఈ వ్యవస్థతో మరింత బలపడుతుందన్నారు.
Also Read: Konda Surekha: అటవీ పరిరక్షణకు వెనకడుగు వేయొద్దు.. ఫారెస్టు అధికారులకు మంత్రి కొండా ఆదేశం!
టెక్నాలజీతో వన్యప్రాణి సంరక్షణ
పులి గ్రామాలకు చేరువైనప్పుడు వెంటనే అలర్ట్ వచ్చి, బృందాలు త్వరగా స్పందించి ప్రమాదాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5:30లోపు ఫీల్డ్ ఆఫీసర్లు తమ నివేదికలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. డేటాను టీజీఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. టెక్నాలజీతో వన్యప్రాణి సంరక్షణ మరింత బలపడుతున్నదని వెల్లడించారు. టైగర్ మానిటరింగ్ సెల్ అడవులను మరింత సురక్షితం చేస్తుందని, సిబ్బందికి మద్దతు ఇస్తుందని, రాష్ట్రంలో వన్యప్రాణుల భవిష్యత్తును కాపాడుతుందన్నారు.
నెహ్రూ జూలాజికల్ పార్కుకి ఐఎస్వో సర్టిఫికేషన్
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఐఎస్వో 9001:2015 సర్టిఫికేషన్ వచ్చింది. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా నెహ్రూ జులాజికల్ క్యూరేటర్ వసంతకు మంగళవారం సచివాలయంలో అందజేశారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వరుసగా ఆరు సంవత్సరాలు ఈ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొట్టమొదటి జూ అని మంత్రికి వివరించారు. ఐఎస్వో 9001 సర్టిఫికేట్ నాణ్యతా నిర్వహణ ప్రమాణాలను నిర్ధారిస్తుందని అన్నారు. జూ స్థిరమైన సేవా నాణ్యత, సమర్థవంతమైన, పారదర్శక అంతర్గత ప్రక్రియలు, జంతు సంరక్షణ, పెంపకంలో అనుసరించే ప్రామాణిక విధానాలు, టికెటింగ్, సందర్శకుల సేవలు, అత్యవసర ప్రతిస్పందన , సిబ్బంది శిక్షణ, నైపుణ్యాభివృద్ధి ఉన్నాయని వివరించారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ దేశంలోని అతిపెద్ద జూలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా సందర్శకులను ఆకర్షిస్తుందని నెహ్రూ జులాజికల్ క్యూరేటర్ వసంత వివరించారు.
Also Read: Konda Surekha: ధర్మపురి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
