Warangal: రాజధాని నగరం హైదరాబాద్తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ను హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ నగరాన్ని వేగంగా అభివృద్ధి చేయడం పై మాట్లాడారు.
వరంగల్లో స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏఱ్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నాలాలు ఆక్రమణకు గురికాకుండా యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలన్నారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని చెప్పారు. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నేరుగా టెక్స్టైల్ పార్క్కు కనెక్టివిటీగా రోడ్డు మార్గం ఉండాలని తెలిపారు.
వరంగల్లో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ దిశగా ప్రణాళికలు రెడీ చేయాలని తెలిపారు. వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
అధికారులపై గుస్సా
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయాన్ని పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహించారు. ఎలాంటి అప్రూవల్ లేకుండా రూ. 1,100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ. 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ. 626 కోట్ల వ్యయాన్ని ఎలా పెంచుతారని ఆగ్రహించారు. నిబంధనలకు విరుద్దంగా అంచనా వ్యయం పెంచడమేమిటని సీరియస్ అయ్యారు. నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు.