CM Revanth Reddy: ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డు వద్దగల ఆమె విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. పలువురు మహిళలకు తన చేతుల మీదుగా చీరలు అందించి.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇందిరమ్మపై ప్రశంసల జల్లు
చీరల పంపిణీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాటారు. ఇందిరా గాంధీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ‘దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైంది. పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధీ గారిది’ అంటూ సీఎం రేవంత్ ప్రశంసలు కురిపించారు.
ఇందిరమ్మ స్ఫూర్తితో పాలన
ఇందిరమ్మ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశాం. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Supreme Court: సుప్రీం తీర్పుపై ఉత్కంఠ.. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ..!
రెండు విడుతల్లో చీరల పంపిణీ
ఇందిరిమ్మ చీరలను రెండు విడతల్లో రాష్ట్రంలోని మహిళలకు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి 8న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలి’ అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
