Hyper Aadi: ప్రియదర్శి, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమంటే’ సినిమా ట్రైలర్ వేడుకలో హాస్యనటుడు హైపర్ ఆది చేసిన ప్రసంగం ఇప్పుడు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తనదైన పంచ్ డైలాగ్లు, ప్రాసలతో ప్రేక్షకులను అలరించే ఆది, ఈ వేదికను సినిమా వ్యక్తులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలపై తన గళాన్ని వినిపించడానికి ఉపయోగించుకున్నారు. ఆది మాట్లాడుతూ.. “సినిమాను చంపేసిన ‘ఐబొమ్మ’ దరిద్రం పోయింది, కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియాలో ఉండే నెగెటివిటీ.” అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లెజెండరీ నటుల నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుల వరకు ప్రతి ఒక్కరిపై విపరీతమైన వ్యతిరేకత చూపించడం సరికాదన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read also-Rahul Sipligunj wedding: టాలీవుడ్ స్టార్ సింగర్ పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి తొలి ఆహ్వానం..
ట్రోలర్స్కి కౌంటర్
ముఖ్యంగా ఇటీవల ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఈవెంట్లో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించి, ఆయనపై ట్రోలింగ్ చేయడంపై హైపర్ ఆది స్పందించారు. “రాజమౌళి హనుమంతుడిని అవమానించలేదు. ఆయన సరదాగా చెప్పిన విధానాన్ని కొందరు అర్థం చేసుకోలేక పెద్ద సమస్యగా చూపిస్తున్నారు. దేవుడిని కించపరిచే ఉద్దేశం ఆయనలాంటి వ్యక్తికి అస్సలు ఉండదు. ఆయన హనుమంతిడిపై అలిగాడే తప్ప అవమానించలేదు” అని రాజమౌళికి గట్టి మద్దతు ప్రకటించారు. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి తీసుకెళ్లిన రాజమౌళి వంటి దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవివేకమని పేర్కొన్నారు.
Read also-Tulasi retirement: సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలికిన సీనియర్ నటి తులసి.. ఇక నుంచి సాయిబాబా సేవలో..
ప్రభావం
హీరోలు, దర్శకులపై నిత్యం జరిగే ట్రోలింగ్ను ప్రస్తావిస్తూ ఆది… “అల్లు అర్జున్ నవ్వినా ట్రోల్.. రామ్ చరణ్ మాట్లాడినా ట్రోల్.. ఎన్టీఆర్ సన్నబడినా ట్రోల్.. చిరంజీవి లుక్పైన ట్రోల్.. ప్రభాస్పైనా ట్రోలింగ్.. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయినా ట్రోలింగ్.. ఇది మన కల్చర్ కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి వారిపై ట్రోల్ చేస్తే పట్టించుకోనని, కానీ కొందరు సెన్సిటివ్గా ఉంటారని, అలాంటి ట్రోల్స్ వారి మానసిక ఆరోగ్యంపైనా, వారు చేసే సినిమాలపైనా ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. సినిమా వ్యక్తులు కేవలం వినోదాన్ని పంచే యంత్రాలు కాదని, వారికీ భావాలు ఉంటాయని గుర్తు చేశారు. సోషల్ మీడియా విమర్శలు ఒక పరిమితిలో ఉండాలని, వ్యక్తులపై అవమానకరమైన దూషణలు వెంటనే ఆపాలని హైపర్ ఆది విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిన చిరంజీవి, రాజమౌళి వంటి వారిని, అలాగే ప్రతి ఒక్క నటుడిని గౌరవించాలని కోరుతూ, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వ్యవహార శైలి అవసరాన్ని ఆది నొక్కి చెప్పారు. ఆది చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సినీ పరిశ్రమ కోసమే కాకుండా, సాధారణ జీవితంలో కూడా పెరిగిపోతున్న అనవసరమైన విమర్శలు, నెగెటివిటీ గురించి ప్రజలు ఆలోచించేలా చేశాయి.
