– కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు విజ్ఞప్తి
– స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన సభ సెక్రెటరీకి ఇమెయిల, స్పీడ్ పోస్ట్
Jagadish Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పలుమార్లు డిమాండ్ చేశారు. శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్ సమయం ఇస్తే ఫిర్యాదు ప్రతిని అందిస్తామని తెలిపారు. తాజాగా, ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్కు శాసన సెక్రెటరీకి ఇమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్లపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వీరిద్దరూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి ముందు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు కూడా బీఆర్ఎస్ టికెట్ పై అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి శాసన సభ్యత్వంపైనా అనర్హత వేటు వేయాలని గతంలో బీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోగా.. దాని మిత్రపక్షం సీపీఐ ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బాట పట్టారు. ఇప్పటికి ఐదుగురు ఎమ్మెల్యేలు మారగా.. మరో 20 మంది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొనడం గమనార్హం. మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే ముప్పు ఉండటంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం కాగా.. జిల్లాల ఎమ్మెల్యేలతో బుధవారం భేటీ అయ్యారు. ఎవరూ పార్టీ మారొద్దని, భవిష్యత్లో పార్టీ పుంజుకుంటుందని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరుణంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో హస్తం పార్టీ సీనియర్ లీడర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకపైనా ఆయన ఆరా తీసినట్టు తెలిసింది.