Varanasi Release Date: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా విడుదల తేదీని సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అధికారికంగా ప్రకటించడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం 2027 సమ్మర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ పాన్-వరల్డ్ చిత్రం గురించి విశేషాలను పంచుకోవడం కోసం ఇటీవల హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ‘గ్లోబ్ ట్రాటర్’ అనే మెగా ఈవెంట్ను చిత్ర యూనిట్ అంగరంగ వైభవంగా నిర్వహించింది. రాజమౌళి మార్క్తో అద్భుతంగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమంలో చిత్రానికి సంబంధించిన అనేక కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగానే సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ను ఖరారు చేసి, మహేష్ బాబు పాత్రను ‘రుద్ర’గా పరిచయం చేశారు.
Read also-Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా
వేదికపై మాట్లాడిన సంగీత దర్శకుడు కీరవాణి తనదైన శైలిలో సినిమా విడుదల తేదీని వెల్లడించడం ఈ ఈవెంట్కే హైలైట్గా నిలిచింది. మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం ‘పోకిరి’లోని ఐకానిక్ డైలాగ్ను తనదైన ట్విస్ట్తో చెబుతూ, “నేను కొత్తగా ఒక ఫ్లాట్ కొన్నాను. అది హైదరాబాద్లోనో, వైజాగ్లోనో కాదు. సిమెంట్తో కట్టింది కాదు. అది మహేష్ బాబు అభిమానుల గుండెల్లో ఉంది. బిల్డర్ హ్యాండోవర్ చేసేశారు.. నిర్మాత సంతోషం.. దర్శకుడు సంతోషం.. మెలోడీ నాది, బీట్ నాది. 2027 సమ్మర్లో కలుద్దాం!” అని ప్రకటించారు. దీంతో అభిమానుల హర్షధ్వానాలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది.
‘వారణాసి’ చిత్రం పాన్-వరల్డ్ విజన్తో, యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోంది. విడుదలైన టైటిల్ వీడియో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లలో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, వారణాసి వంటి విభిన్న ప్రదేశాలను చూపించారు. చివర్లో మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని, పవర్ ఫుల్ లుక్లో ఎద్దుపై వస్తున్న దృశ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ విజువల్స్ ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో, హీరోయిన్గా ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటించనున్నారు. ‘వారణాసి’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ విడుదలైన ప్రతి ఒక్క అంశం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. 2027 వేసవి వరకు ఎదురుచూడటం అభిమానులకు మరింత కష్టంగా మారుతుందనడంలో సందేహం లేదు. అయితే ప్రతి సినిమాకు దర్శకుడు రాజమౌళి టైమ్ ఎక్కువ తీసుకోవడంపై అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో సినిమా విడుదల లేట్ అవుతుందని తెలుస్తోంది.
