– గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?
– జీడీపీ అధికంగా వచ్చే రంగాలపైన దృష్టి
– వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో భట్టి, తుమ్మల భేటీ
– వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ
Telangana Farmers: గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి? అందుకు గల కారణాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను అడిగారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీరిద్దరూ కలిసి వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, రాబోయే సీజన్కు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై సమీక్షించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కాలేజీలు లేని జిల్లాల వివరాలను డిప్యూటీ సీఎం సమావేశంలో తీసుకున్నారు.
సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం, అయితే వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తులు పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలు, ప్రభుత్వం తదితర రంగాలపై చేస్తున్న ఖర్చులను డిప్యూటీ సీఎం అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇక, రైతు భరోసాకు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకు పోతే మంచిది అనే విషయాలను రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని, రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతులను భాగస్వాములను చేయాలని, అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్కు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయం వ్యక్తపరిచారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్పై సమీక్ష చేశారు మంత్రులు. ఆయిల్ ఫామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాలు ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో వచ్చిన మార్పులపై డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్ టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి ఏ పద్ధతిలో ప్రయోజనం పొందుతున్నారు, తదితర వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు.