ACB Raid:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అధికారిక విధులు నిర్వహించేందుకు లంచం తీసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు అతడి వద్ద డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తిని ఏసీబీ అధికారులు (ACB Raid) గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల మున్సిపాలిటీలో బందెల వరప్రసాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. ఇదే మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి జీ ప్లస్-4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పని చేసి పెట్టడానికి వరప్రసాద్ ఏకంగా రూ.75 వేలు లంచం డిమాండ్ చేశాడు. దాంతో అవతలి వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వరప్రసాద్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు వల పన్నారు. ప్లాన్ ప్రకారం కెమికల్ పూసిన కరెన్సీ నోట్లను తమను ఆశ్రయించిన వ్యక్తికి అందించారు. గురువారం మున్సిపల్ ఆఫీస్కు ఆ వ్యక్తి రాగా వరప్రసాద్ తన వద్ద డ్రైవర్గా పని చేస్తున్న వంశీకృష్ణ ద్వారా ఆ డబ్బు తీసుకున్నాడు. వెంటనే దాడి చేసిన ఏసీబీ అధికారులు వరప్రసాద్, వంశీకృష్ణలను అరెస్ట్ చేశారు. వారి నుంచి లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు లంచం డిమాండ్ చేసిన 1064 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.
Read Also- Actor Nagarjuna: కొండా సురేఖ క్షమాపణలు.. శాంతించిన నాగార్జున.. నాంపల్లి కోర్టులో కేసు విత్ డ్రా
జమ్మికుంటలో అనధికార క్లీనిక్
మూసివేస్తూ డిప్యూటీ డీఎంహెచ్వో ఆదేశం
జమ్మికుంట/హుజురాబాద్, స్వేచ్ఛ: హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందు గురువారం నాడు జమ్మికుంట పట్టణంలోని ‘సెరా లైఫ్’ అనే ప్రైవేట్ క్లినిక్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో క్లినిక్ నిర్వహణకు సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. క్లీనిక్ పత్రాలు, చట్టపరమైన అనుమతులను పరిశీలించిన డాక్టర్ చందు, ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయంపై క్లినిక్ నిర్వాహకుడికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని చెబుతూ, డిప్యూటీ డీఎంహెచ్వో క్లీనిక్ నడుపుతున్న వ్యక్తికి తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వరకు క్లినిక్ను వెంటనే మూసివేయాలని స్పష్టంగా సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే క్లినిక్ను తిరిగి ప్రారంభించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అర్హతగల వైద్యుల వద్దే చికిత్స పొందండి
ఈ సందర్భంగా డాక్టర్ చందు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజలు వైద్యం చేయించుకోవడానికి కేవలం అర్హత, లైసెన్స్ ఉన్న వైద్యుల వద్దకే వెళ్లాలని కోరారు. అర్హత లేని వ్యక్తుల వద్ద చికిత్స చేయించుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు. అలాగే, అందరూ ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.
Read Also- CM Chandrababu: ఏపీకి గుడ్ న్యూస్.. రెండ్రోజుల్లో విశాఖకు గూగుల్.. వెల్లడించిన సీఎం చంద్రబాబు
