Thummala Nageswara Rao: సమయపాలనను కఠినంగా అమలు చేయాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం హాకా , సీడ్ సర్టిఫికేషన్ కార్పొరేషన్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రధాన కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి తనిఖీ చేసిన అన్ని కార్యాలయాల్లోనూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాంపల్లిలోని చేనేత భవన్లో ఉదయం 10:30 గంటల సమయానికి కూడా అధికారులు విధులకు హాజరు కాలేదు.
మేనేజర్ స్థాయి అధికారులు నిర్లక్ష్యం
అదే విధంగా హాకా, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేషన్ కార్యాలయాల్లోనూ 10:30 గంటల నుంచి 10:50 వరకు కొందరు కీలక అధికారులు సైతం రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది సమయపాలన పాటిస్తుండగా, రెగ్యులర్ ఉద్యోగులు, జనరల్ మేనేజర్, మేనేజర్ స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. సమయానికి విధులకు హాజరుకాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆయా శాఖల కమిషనర్లు, ఎండీలకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ సమయపాలన పాటిస్తూ, ప్రజా సేవలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని తుమ్మల సూచించారు.
Also Read:Thummala Nageswara Rao: పత్తి సేకరణకు మరీ ఇన్ని ఆంక్షలా?.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
